గుర్తు తెలియని వ్యక్తులు మాజీ మేయర్ ఇంట్లోకి ప్రవేశించి..
తమిళనాడులోని తిరునల్వేలి నగర మాజీ మేయర్ ఉమామహేశ్వరి దారుణహత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అత్యంత కిరాతకంగా చంపారు. ఆమెతో పాటు భర్త మురగ శంకరన్, పనిమనిషి మారిని కూడా దుండగులు నరికి చంపారు. రోజ్ నగర్లోని ఆమె ఇంట్లోనే మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఇల్లంతా రక్తపుమడుగులా మారింది. ఈ ఘాతుకానికి ఎవరు, ఎందుకు పాల్పడ్డారన్నది తెలియరాలేదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
ఉమామహేశ్వరి తిరునల్వేలి నగరానికి 1996లో తొలిమహిళా మేయర్ గా ఎన్నికయ్యారు. డిఎంకే పార్టీ చెందిన ఉమామహేశ్వరికి మంచి పేరుంది. సామాన్యులకు అందుబాటులో ఉంటూ.. నిత్యం వారిసమస్యలు పరిష్కరించేవారు. దశాబ్ధాలుగా వీరి కుటుంబం డిఎంకేకు సానుభూతిపరులుగా ఉంది. భర్త ప్రభుత్వ మురగశంకరన్ ఇంజినీరుగా ఉద్యోగం చేసి పదవివిరమణ చేశారు. 2011లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అటు రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటూనే.. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు. ఆలయాల్లో వీణ కచేరీలు కూడా ఇస్తుండేవారు.
తాజా ఘటనతో నగరంలో విషాదం అలముకుంది. హత్యకు కారణమైనవారిని పట్టుకుని శిక్షించాలని డిఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దోపిడీ దొంగల పనా.. లేక రాజకీయ హత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాజకీయంగా ఆమెకు శత్రువులు లేరని చెబుతున్నారు సన్నిహితులు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను వేసిన కమిషనర్ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com