అరటిఆకులో భోజనంచేస్తే ఆరోగ్యానికి మంచిదేనా?

అరిటాకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచే జరుగుతుందని పెద్దలు, వైద్యులు చెబుతున్నారు. ఆకుపచ్చని అరటి ఆకులో వేడి వేడి పదార్థాలను వేసుకుని భుజించటంవల్ల కఫవాతాలు తగ్గిపోతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. మంచిగా ఆకలి కలుగుతుంది. ఆరోగ్యం చక్కబడి, శరీరానికి మంచి కాంతి వస్తుంది. పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినటంవల్ల త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందనీ, మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని అంటుంటారు. మహా విష్ణువు స్వరూపం అయిన మర్రిచెట్టు ఆకులతో అన్నం తింటే, క్రిమిరోగ నివారిణిగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది. అరటి, మోదుగ ఆకులలో భోజన చేయటంవల్ల ప్రేగులలోని క్రిములు నాశనం అవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అలాగే అరటి చెట్ల నుంచి లభించే అరటిపండు కూడా చాలా శ్రేష్టమైనది. ఈ పండులో అత్యధికంగా లభించే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడులను హరిస్తుంది. అరటిపండును రాత్రివేళల్లో పాలతోపాటు తీసుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. అరటి పండులోని పొటాషియం శరీర కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలకు కూడా అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీనిని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. పచ్చి అరటికాయలు విరేచనాలు, అరటిపండు మలబద్ధకాన్ని, అల్సర్లను నివారించటంలో క్రియాశీలంగా పనిచేస్తాయి.