Narendra Modi: 'విద్వేషపూరిత రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి'.. మోదీకి రిక్వెస్ట్

Narendra Modi: విద్వేషపూరిత రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి.. మోదీకి రిక్వెస్ట్
Narendra Modi: బీజేపీ రాష్ట్రాల్లో విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చుమీరాయంటూ మోదీకి లేఖ రాశారు ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు.

Narendra Modi: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చుమీరాయంటూ ప్రధాని మోదీ లేఖ రాశారు 108 మంది ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు. విద్వేషపూరిత రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఈ లేఖలో మోదీని కోరారు. ముస్లింలు, ఇతర మైనారిటీలతో పాటు రాజ్యాంగాన్ని సైతం ధ్వంసం చేస్తున్న ఇలాంటి చర్యలకు ముగింపు పలికేలా చొరవ తీసుకోవాలన్నారు.

అసోం, గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని లేఖలో తెలిపారు. ఈ రాష్ట్రాలన్నీ బీజేపీ అధికారంలో ఉన్నవేనని గుర్తుచేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకొంటున్న ఈ ఏడాదిలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలని విజ్ఙప్తి చేశారు. గతంలో ఎంతో బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించిన తాము ఇలాంటి లేఖ రాయాల్సి వస్తుందని ఊహించలేదన్నారు.

తాజా పరిస్థితులకు భయపడే తాము ఈ లేఖ రాసినట్టు స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అని మీరు చెబుతుంటారని.. ఆ హామీని మనస్ఫూర్తిగా పూర్తి చేయాలని మోదీకి రాసిన లేఖలో మాజీ బ్యూరోక్రాట్లు విజ్ఞప్తి చేశారు. లేఖపై సంతకం చేసిన వారిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, మాజీ జాతీయ భద్రత సలహాదారు శివశంకర్‌ మీనన్‌, మాజీ హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లే , మాజీ విదేశాంగశాఖ కార్యదర్శి సుజాతసింగ్‌ తదితరులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story