Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ యోగీనే సీఎం.. అప్పుడే ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలు..

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ యోగీనే సీఎం.. అప్పుడే ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలు..
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మళ్లీ ఘనవిజయం సాధించింది.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మళ్లీ ఘనవిజయం సాధించింది. ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ-రాష్ట్ర బీజేపీ నాయకత్వాల సమష్టి కృషి అని చెప్పాలి. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది మాత్రం సీఎం యోగీ ఆదిత్యనాథ్ అనే చెప్పాలి. ఆయన వ్యక్తిగత ఛరిష్మా, సీఎంగా ఆయన అనుసరించిన విధానాలు, పాలనాదక్షత.. ఇవన్నీ పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.

యోగీ ఆదిత్యనాథ్ వ్యక్తిత్వం చాలా విలక్షణమైంది. ఎలాంటి అవినీతి మరకలు లేని వ్యక్తి. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. చాలా మంది రాజకీయ నాయకులు ఏదైనా పనిచేయాలంటే నాన్చుతారు. కానీ అది యోగీకి అస్సలు నచ్చదు. ఏదైనా సరే వెంటనే తేల్చేయడం ఆయనకు అలవాటు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోడానికి ప్రయత్నిస్తారు.

అంతేగానీ వాటి నుంచి బయటపడడానికి ఇతరులపైకి నెట్టేయాలని చూడరు. ఆయనలోని ఈ గుణాలన్నీ ఉత్తరప్రదేశ్ యువతకు బాగా నచ్చాయి. అందుకే యోగీని మిస్టర్ బుల్డోజర్ గా పిలుచుకుంటారు. యూపీ అంటే ఒకప్పుడు గూండారాజ్. కానీ ఇప్పుడక్కడ నేరాలు చేయాలంటే క్రిమినల్స్ ప్యాంటు తడిసిపోతుంది. బయట తిరగడం కంటే జైళ్లలో ఉండడమే మేలని భావిస్తున్నారట నేరస్థులు.

ముక్తార్‌ అన్సారీ వంటి యూపీకి చెందిన బడా క్రిమినల్స్ పంజాబ్‌ జైళ్లలోనే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారంటే యూపీలో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో కంట్రోల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం యోగీనే. అరాచకాలు సృష్టించాలనుకుంటే.. అయితే జైల్లో ఉంటాడు. లేదంటే పైకి పోతాడనే పరిస్థితి యూపీలో కనిపిస్తోందంటారు. యోగి సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత నేరాలను, అవినీతిని అరికట్టడానికి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

నేరాలు, అవినీతికి ఆస్కారం ఉన్న హోం, రెవెన్యూ, హౌసింగ్, మైన్స్ వంటి అత్యంత కీలక శాఖలు సహా మొత్తం 36 మంత్రిత్వశాఖలను తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. అందుకే నేరాలను చాలావరకు అదుపుచేయగలిగారంటారు విశ్లేషకులు. నేరగాళ్లను అదుపుచేస్తామంటూ అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ పూర్తిగా విఫలమైంది. పైగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్థులు జూలు విదిల్చారు. ఇదే 2017లో ఆ పార్టీ ఓటమికి కారణమైంది.

వీటన్నింటినీ గమనించిన యోగీ ఆదిత్యనాథ్.. అధికారం చేపట్టగానే నేరస్థుల భరతం పట్టడం మొదలు పెట్టారు. మొత్తం ఐదేళ్లలో 182 మంది నేరగాళ్ల ఎన్ కౌంటర్ జరుగగా.. కీలక ఆపరేషన్లలో 4 వేల 206 మందికి కాళ్లపై కాల్పులు జరిపారు పోలీసులు. ఇక 21 వేల 625 మందిని అరెస్టు చేసి జైల్లో ఊచలు లెక్కబెట్టిస్తున్నారు. యూపీలో ఒకప్పుడు బందిపోట్లు రెచ్చిపోయేవారు.

కానీ యోగి అధికారం చేపట్టాక బందిపోట్ల ఘటనలు 72శాతం తగ్గాయని రికార్డులు చెబుతున్నాయి. అంతేకాదు దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లతో అల్లకల్లోలంగా ఉండేది. అలాంటిది యోగి వచ్చాక 62శాతం దోపిడీలు, 31శాతం హత్యలు, 50 శాతం అత్యాచారాలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులను ఊచకోత కోసిన కరడుగట్టిన నేరగాడు వికాస్ దూబేతోపాటు అతడి ముఠాను మట్టుబెట్టించిన ఘనత యోగీదే అంటారు.

నేరగాళ్ల పట్ల సింహస్వప్నంగా నిలవడం వల్లనే యోగీకి మహిళా ఓటర్లు మద్దతుగా నిలిచారంటారు విశ్లేషకులు. ఈసారి పురుష ఓటర్లకంటే మహిళా ఓటర్లే ఎక్కువగా బీజేపీ పక్షాన నిలిచినట్లు పలు సర్వేలు వెల్లడించాయి. దీనికి లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ లో ఉంచడంతోపాటు యోగి చేపట్టిన చాలా సంక్షేమ పథకాలు కూడా కారణమనే చెప్పాలి. కరోనా సమయంలో పేదలు పడిన కష్టాలు ఇప్పటికీ కళ్లముందు మెదలాడుతూనే ఉంటాయి.

అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలతోపాటు, ఉచిత రేషన్ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం బీజేపీకి కలిసొచ్చిందని చెప్పాలి. రెండేళ్ల నుంచి దాదాపు 15 కోట్ల మంది పేదలు ఈ పథకాలతో లబ్దిపొందినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2 కోట్ల 40 లక్షల మందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, 10 కోట్ల 20 లక్షల మందికి పీఎం ఆవాస్ యోజనతో లబ్ది చేకూరేలా చేశారు.

కోటిన్నర మందికి పీఎం ఉజ్వల, 7 కోట్ల 80 లక్షల జన్‌ధన్ ఖాతాలు, 80 లక్షల కుటుంబాలుకు ఉపాధి హామీని యూపీలో అమలు చేశారు. ఇక కోటి 30 లక్షల మందికి ఆయుష్‌ భారత్‌, 36 వేల కోట్లతో పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాలను అమలు చేశారు. కిసాన్ నిధి, ఉజ్వల పథకాల లబ్ధిదారులను కలిపితే దాదాపు నాలుగోవంతు యూపీ ఓటర్లు ఉంటారు.

వీటితోపాటు మంచి మార్కులు సాధించిన విద్యార్థినిలకు స్కూటర్ల పంపిణీ, విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, యూనిఫామ్ అలవెన్స్ కేటాయింపు, 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజా రవాణాలో ఉచిత ప్రయాణం వంటివి యోగికి, బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెంచాయి. ఆ పార్టీ సెకండ్ టర్మ్ కూడా ఘనవిజయం సాధించడానికి ఇవన్నీ దోహదపడ్డాయి. బీజేపీలో మోదీ 2.0గా యోగీకి పేరుంది. ఇటీవల ఇండియా టుడే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో బీజేపీ తరపున మోదీ తర్వాత ప్రధాని అభ్యర్థిగా అత్యంత పాపులారిటీ ఉన్న నేత యోగినే. ఆయన వయస్సు 49 ఏళ్లే. రాజకీయాల్లో ఈ వయసువారిని యూత్ గానే పరిగణిస్తారు. దటీజ్ యోగి.

Tags

Read MoreRead Less
Next Story