పత్తి రైతును నట్టేట ముంచిన నాసిరకం విత్తనాలు
పత్తిపంట ఆశించిన దిగుబడి వచ్చి తన తలరాత మారుస్తుందనుకున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతు ఆశలు అడియాసలయ్యాయి. పత్తి విత్తనాలు వేసి.. మొక్క పెరుగుతున్న దశలో రైతు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే చివరికి అవి నాసిరకం విత్తనాలుగా తేలి.. ఆ రైతును నట్టేట ముంచాయి. మొక్కలు పెరుగుతున్నా... పూత లేకపోవడంతో రైతు దిగాలు చెందాడు. రెండెకరాల్లో వేసిన పత్తి మొక్కలను తొలగించాడు.
వాంకిడి మండలంలోని ఖమన గ్రామానికి చెందిన బండే శంకర్ అనే రైతు ఓ ఫెర్టిలైజర్ దుకాణం నుంచి ఆరు రకాల విత్తనాలు కొనుగోలు చేశాడు. నాలుగు ఎకరాల్లో పత్తి పంటను వేశాడు. రెండు ఎకరాల్లో పత్తి మొక్కలు ఏపుగా పెరిగినా కాపు కాయలేదు. వాటిలో ఏవి నాసిరకం విత్తనాలో గుర్తించలేకపోయినట్టు రైతు శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాసిరకం విత్తనాలతో దాదాపు లక్ష రూపాయలు నష్టపోయినట్టు కన్నీటిపర్యంతమయ్యాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com