తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ వరాలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ వరాలు
న్నిరకాల ఉద్యోగులు కలిపి తెలంగాణలో 9లక్షల 36వేల 976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు.

నూతన సంవత్సర కానుకగా తెలంగాణలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్‌. వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని అదే విధంగా అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్డడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు.

అన్నిరకాల ఉద్యోగులు కలిపి తెలంగాణలో 9లక్షల 36వేల 976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపు వల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరి లోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు సీఎం వెల్లడించారు.

అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి సీఎస్‌ సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా.. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని సీఎం నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటివారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంద‌న్నారు సీఎం కేసీఆర్‌.

ప్రభుత్వానికున్న ఆర్ధిక పరిమితుల మేర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న అన్నిరకాల ఉద్యోగులకు ఖచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలన్నారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని.. మార్చి నుండి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి కావాలని సీఎం అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.

ప్రతి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో తెలిసి ఉండాలన్నారు సీఎం. రిటైర్ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలని..దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్ రూపొందించాలన్నారు కేసీఆర్‌. సమయానికి ఉద్యోగికి రావల్సిన ప్రమోషన్ ఆర్డర్ వచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయా శాఖల్లో శాఖాధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాల‌ని సూచించారు. ఉద్యోగులు దాదాపు 35 సంవత్సరాల పాటు ప్రభుత్వం కోసం, ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తారని... అలాంటి ఉద్యోగులకు చాలా గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం, బాధ్యత ఉందన్నారు. రిటైరైన రోజే రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ అందించాలన్నారు కేసీఆర్‌. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరగడం అత్యంత విషాదకరమ‌ని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, పదవీ విరమణ వయస్సును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story