TSRTC: పెరగనున్న టీఎస్ఆర్టీసీ ఛార్జీలు.. పల్లె వెలుగులో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎంతంటే..
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో ఛార్జీల పెంపు తప్పదని స్వయంగా రవాణాశాఖ మంత్రే ప్రకటించారు. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 25పైసలు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కిలోమీటరకు 30పైసల చొప్పున పెంపు ఉండనుంది. ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై ఏడాదికి 680 కోట్ల భారం మోపనుంది.
ఛార్జీల పెంపుతో పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్కు ప్రస్తుత మున్న 83పైసల నుంచి రుపాయి 8 పైసలకు.... సెమీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో 95 పైసల నుంచి రుపాయి 25 పైసలకు.. ఎక్స్ప్రెస్ బస్సుల్లో రుపాయి 7 పైసల నుంచి రుపాయి 37 పైసలకు.... డీలక్స్ బస్సుల్లో రుపాయి 18 పైసల నుంచి రుపాయి 45 పైసలకు పెరగనుంది.
తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కొంత వరకైనా గట్టెక్కించేందుకే చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే సీఎం కేసీఆర్కు సమర్పించారని, అనుమతి రాగానే కొత్త చార్జీలు అమలు చేస్తామని ప్రకటించారు. డీజిల్ ధర 27శాతానికిపైగా పెరగడంతో ప్రతి రోజూ 6.8లక్షల లీటర్లను వినియోగిస్తున్న ఆర్టీసీపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com