దుబ్బాక నుంచి గ్రేటర్‌కి వచ్చేసిన కారు..సైలెంట్‌గా క్యాంపైనింగ్ ..

దుబ్బాక నుంచి గ్రేటర్‌కి వచ్చేసిన కారు..సైలెంట్‌గా క్యాంపైనింగ్ ..

దుబ్బాకలో గేరు మార్చి స్టీరింగ్ తిప్పిన కారు గుర్తు పార్టీ.. నేరుగా గ్రేటర్‌లోకి ప్రవేశించింది. దుబ్బాక ఎన్నికల ప్రచారం తరువాత కాస్త రిలాక్స్ అవుతున్న ఇతర పార్టీలకు షాక్ ఇస్తూ.. అప్పుడే ప్రచారం షురూ చేసింది. కాంగ్రెస్, బీజేపీలు గ్రేటర్‌లో ఎలాంటి వ్యూహం రచించాలన్న దానిలోనే ఇంకా తలమునకలై ఉన్నాయి. ఈ గ్యాప్‌లోనే తన ప్రచారాన్ని ప్రారంభించేసింది టీఆర్ఎస్. నేతలెవ్వరూ ప్రచారంలోకి దిగకపోయినా.. గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎప్పుడో మొదలైంది. అదిప్పుడు ఇలా గోడలపై కనిపిస్తోంది.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తూ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను హోర్డింగులలోకి ఎక్కించింది టీఆర్ఎస్. నగర ప్రజలకు అందిస్తున్న పథకాలు, నగర అభివృద్ధి కోసం చేసిన పనులను వివరిస్తూ కటౌట్లు పెట్టింది. మెట్రో పిల్లర్లు, బస్‌ స్టాపులపై హోర్డింగులు పెట్టించింది. డివైడర్స్ మధ్యన లాలిపాప్ యాడ్స్‌ను కుమ్మరించింది. నగర నలుమూలలా కటౌట్లు, హోర్డింగులు పెట్టేసింది టీఆర్ఎస్.

ఇప్పుడు హాట్ టాపిక్ అంతా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లే. తలసాని, భట్టి మధ్య చాలెంజ్‌యుద్ధం గుర్తుందిగా. దానికి కొనసాగింపుగా అన్నట్టు.. గ్రేటర్‌లో లక్ష ఇళ్లు అందిస్తున్నామని చెప్పేలా యాడ్స్ రూపొందించింది టీఆర్ఎస్‌. వీటితో పాటు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్లు, 5 రూపాయల భోజనం, నగరంలో కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, మెట్రో రైల్ సేవలను కూడా ప్రచారంలో భాగంగా మార్చేసుకుంది టీఆర్ఎస్. హైదరాబాద్ రోడ్లపై ఎక్కడ చూసినా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు, ప్రభుత్వ పథకాలను చెప్పే యాడ్స్ దర్శనమిస్తున్నాయి. మొత్తానికి హైదరాబాద్‌లో ఎన్నికల వేడి రగిల్చింది టీఆర్ఎస్.

Tags

Read MoreRead Less
Next Story