మాదేశంలో కన్నా తెలంగాణలోనే అవి ఎక్కువ..మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్

మాదేశంలో కన్నా తెలంగాణలోనే అవి ఎక్కువ..మంత్రి కేటీఆర్‌తో  సింగపూర్ హైకమిషనర్
ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్ సమావేశమయ్యారు.

KTR: తెలంగాణలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామన్నారు భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్. ఇవాళ ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్, తెలంగాణ గురించి మంత్రి కే టీఆర్‌. సింగపూర్‌ కమిషనర్‌కు వివరించారు. కొన్ని వందలేళ్లుగా హైదరాబాద్‌ దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో వివిధ దేశాల కంపెనీలు దీర్ఘకాలంగా పని చేస్తున్నాయన్నారు.

తెలంగాణ ఏర్పడినప్పటినుంచి అద్భుతమైన ప్రభుత్వ విధానాలతో అంతర్జాతీయ పెట్టుబడులను తీసుకురాగలిగామని హై కమిషనర్‌కు వివరించారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు ఆకర్షించేందుకు పోటీ పడుతుందన్నారు. ఇక్కడ ఉన్న లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే అనేక సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాల పట్ల సానుకూలంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన డీబిఎస్ వంటి కంపెనీలు సానుకూల ఫీడ్‌బ్యాక్‌ అందించాయని హై కమిషనర్, మంత్రి కేటీఆర్ కు తెలిపారు. సింగపూర్ కంపెనీలు ఐటి, ఇన్నోవేషన్, ఐటి అనుబంధ రంగాల్లో ఉన్న బ్లాక్ చైన్ వంటి నూతన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిస్తున్నాయన్నారు సిమోన్‌ వాంగ్‌. హైదరాబాదులో ఉన్న టి హబ్ వంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న ఐటి ఈకో సిస్టం, ఇన్నోవేషన్ సిస్టం గురించిన సానుకూలతలు తెలుసని తెలిపారు. ఒకవైపు ఆధునిక రంగాలలో పెట్టుబడులతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూసింగపూర్ కంపెనీలు ఇక్కడ ఉన్న అవకాశాలు పట్ల ఆసక్తితో ఉన్నాయని తెలిపారు.

సింగపూర్ కంపెనీలు ముందుకు వస్తే తెలంగాణలో ప్రత్యేకంగా సింగపూర్ పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక జోన్ లేదా సింగపూర్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ ప్రతిపాదన ఒక గొప్ప ఆలోచన అని, గతంలో తాను వియాత్నంలో పని చేసినప్పుడు ఇలాంటి ఒక ప్రయత్నం అక్కడ అనేక పెట్టుబడులను ఆకర్షించి, విజయవంతంగా కొనసాగుతోందన్నారు సిమోన్‌ వాంగ్. ఖచ్చితంగా ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. సమావేశానంతరం మంత్రి కేటీఆర్‌, హైకమిషనర్ సిమోన్ వాంగ్ పాటు, చెన్నైలో సింగపూర్ కౌన్సిల్ జనరల్ పొంగ్ కాక్ టియన్ లకు మంత్రి కేటీఆర్ శాలువాలతో సన్మానించారు.


Tags

Read MoreRead Less
Next Story