Huzurabad By election: ఈటలకు ఓటమి తప్పదంటున్న టీఆర్ఎస్..

Huzurabad By election: ఈటలకు ఓటమి తప్పదంటున్న టీఆర్ఎస్..
Huzurabad By election: హుజురాబాద్‌ ఉపఎన్నికల నగారా మోగింది. నోటిఫికేషన్ తర్వాత రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత పెరగనుంది.

Huzurabad By election: హుజురాబాద్‌ ఉపఎన్నికల(Huzurabad By election) నగారా మోగింది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత పెరగనుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా ఢీ కొడుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి విజయం సాధించి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈటల వంటి నేతను మట్టికలిపించి పార్టీకి ఎదురులేదు.. ఎదురుగాలి లేదని నిరూపించాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌ ఉపఎన్నిక వచ్చింది. భూకబ్జా ఆరోపణలు.. పార్టీలో పొమ్మన లేక పొగపెట్టడం వల్ల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని ఈటల.. బీజేపీలో చేరి టీఆర్ఎస్ కు సవాల్‌ విసిరారు. హుజురాబాద్‌ లో విజయంపై ధీమాగా ఉన్న ఈటల.. నియోజకవర్గమంతా కలియ తిరుగుతున్నారు.

ఇప్పటికే పాదయాత్రతో పాటు ప్రజల దీవెనలు పొందేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ లో తనకు జరిగిన అన్యాయం, తెలంగాణ ఉద్యమకాలంలో తాను చేసిన పోరాటాన్ని వివరిస్తున్నారు. అధికార పార్టీలో తనను ఎలా ఇబ్బంది పెట్టారనే అంశాలను నియోజకవర్గ ప్రజలకు విన్నవిస్తున్నారు. ఈటల రాజేందర్‌ విజయాన్ని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈటల గెలుపు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మలుపు కాగలదని అంచనా వేస్తోంది.

ఈటలను ఢీ కొట్టేందుకు టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. కొన్ని నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ ఖరారు కాగా, అతణ్ని ముందుకు నడిపిస్తూ హరీశ్‌రావు నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు. గెల్లు శ్రీనివాస్‌ గెలిస్తే జరగబోయే అభివృద్ధిని వివరిస్తున్నారు.

ఈటల రాజేందర్‌ తన స్వప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారని విమర్శిస్తున్నారు. కనీసం నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్లను కట్టించలేకపోయారని హరీశ్‌రావు మాటల దాడికి దిగుతున్నారు. ఏ అవకాశాన్నీ చేజార్చుకోరాదని .. ఈటల వంటి బలమైన నేతను ఓడిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ ప్రభావం తగ్గించాలని గులాబీ దళం వ్యూహంగా ఉంది. అందులో భాగంగా ఎల్.రమణ, పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డి వంటి నేతలను పార్టీలో చేర్చుకుంది. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ నామినేటెడ్‌ పదవి కేటాయించగా గవర్నర్‌ వద్ద పరిశీలనలో ఉంది.

సీఎం కేసీఆర్ హుజురాబాద్ బై ఎలక్షన్ ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. ఒక్కో లబ్దిదారుకు రూ.10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేస్తున్నారు. నియోజకవర్గంలోని దళితులందిరికి ఉపాధి కల్పన కోసం రూ.10 లక్షల చొప్పున బ్యాంకు ఖాతాల్లో నిధులు జమచేశారు. మరికొందరికి ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు తదితర యూనిట్లు పంపిణీ చేశారు.

దళిత బంధు హుజురాబాద్ ఉపఎన్నిక కోసమేనంటూ విపక్షాలు విమర్శిస్తుండగా అలాంటి ఉద్దేశమే లేదని ప్రకటించిన ప్రభుత్వం మరో నాలుగు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజవర్గాల్లోనూ అమలు చేస్తోంది. పథకం రాష్ట్రమంతా అమలు చేయాలని ఎస్టీలు, బీసీలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, బీజేపీ ఆందోళన చేస్తున్నాయి.

హుజురాబాద్‌ ఉపఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ ల ప్రచారం హోరాహోరీగా సాగుతుండగా కాంగ్రెస్‌ పార్టీ ఇంకా రంగంలోకి దిగలేదు. అభ్యర్థిని ప్రకటించేందుకు ఆశావహుల వివరాలు సేకరించిన గాంధీభవన్‌ వాటిని అధిష్ఠానానికి పంపిస్తామని ప్రకటించింది. కొండా సురేఖ దాదాపు ఖరారయ్యాని ఊహాగానాలు వెలువడగా ఆమె ఇటీవలే ఆ విషయాన్ని ఖండించారు. తాను బరిలోకి దిగడం లేదని స్పష్టం చేశారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్‌రెడ్డికి ఇది తొలి ఉపఎన్నిక. దీంతో ఈ ఎన్నికను కాంగ్రెస్‌కు సవాల్‌గా మారనుంది. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెబుతుండగా .. కాంగ్రెస్‌ పార్టీ ఎలా ఎదుర్కోనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈటల రాజేందర్‌ సిట్టింగ్‌ అభ్యర్థి కావడం వల్ల పోరు రసవత్తరంగా సాగనుంది.

Tags

Read MoreRead Less
Next Story