అతి త్వరలో మేడిన్ హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్

అతి త్వరలో మేడిన్ హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్

యావత్‌ ప్రపంచం దృష్టి కరోనా వ్యాక్సిన్‌పై ఉంటే.. అన్ని దేశాల చూపు మాత్రం భారత్‌ వైపే ఉంది. అందులోనూ ప్రత్యేకించి హైదరాబాద్‌ వైపే అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ రాబోతోంది. వ్యాక్సిన్ అంటూ తయారైతే అది హైదరాబాద్‌లోనే అవుతుందన్న శాస్త్రవేత్తల మాటలు కూడా నిజం కాబోతున్నాయి. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ కేంద్రంగా పరిశోధనలు చేస్తున్న భారత్ బయోటెక్.. కోవ్యాక్సిన్ పేరుతో టీకాను తయారు చేస్తోంది.

భారత్ బయోటెక్ ఉత్పత్తి చేయబోయే కోవ్యాక్సిన్‌ ధర.. వాటర్‌ బాటిల్‌ కన్నా తక్కువ రేటుకే వస్తుందని చెప్పింది. ఇప్పటికే తుది దశ క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగాయి. దీని సక్సెస్ రేటు కూడా సూపర్‌గా ఉందని పరిశోధనలో తేలిందని భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ తెలిపారు. అందుకే, దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తున్న కంపెనీలను సందర్శించడానికి ప్రధాని మోదీ బయలుదేరారు. ఇందులో భాగంగా భారత్ బయోటెక్‌ను కూడా సందర్శిస్తున్నారు. పైగా దేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టిన మొట్టమొదటి కంపెనీ కూడా భారత్ బయోటెకే. జంతువులపై చేపట్టిన ట్రయల్స్‌‌‌‌లో భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ సక్సెస్ అవడంతో ఇక వెనుతిరిగి చూడలేదు. ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్‌‌‌లో ఇమ్యూన్ డెవలప్‌‌‌మెంట్‌‌ కెపాసిటీ పెరిగింది. అంతేకాదు, సార్ కోవ్-2ను పనిచేయకుండా చేసేంత రక్షణ సామర్థ్యం, ఇమ్యూన్ పవర్‌‌‌ను వ్యాక్సిన్‌‌లో డెవలప్ చేసింది భారత్ బయోటెక్.

భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవ్యాక్సిన్‌ను ఇప్పటికే కొన్ని వేల మందిపై ప్రయోగించారు. హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్.. స్వయంగా కోవ్యాక్సిన్ తీసుకోడానికి ముందుకొచ్చారంటే.. సక్సెస్ రేట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్‌ తయారుచేస్తోంది. మొదటి రెండు దశల ట్రయల్స్‌లో కోవ్యాక్సిన్ అత్యుత్తమ ఫలితాలు సాధించింది. డ్రగ్ కంట్రోల్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా అనుమతి కూడా రావడంతో మూడోదశ ప్రయోగాలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. దేశంలోని 25 కేంద్రాల్లో, 26వేల మంది వాలంటీర్లపై కోవ్యాక్సిన్ పరీక్షించారు. ఇంత పెద్ద మొత్తంలో క్లినికల్ ట్రయల్స్ చేపట్టడం దేశంలో అదే తొలిసారి.

కోవ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగ పరీక్షల్లో భాగంగా నిమ్స్‌లో కూడా ట్రయల్స్ వేశారు. ఈ వ్యాక్సిన్‌ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరిగినట్టు తేలింది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా కొందరికి ఇంట్రా మస్క్యూలర్ ఇంజెక్షన్లు, మరికొందరికి మైక్రో కోవ్యాక్సిన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఫేజ్ త్రీ ట్రయల్స్‌లో కూడా అనుకున్న ఫలితాలను సాధిస్తే అతి త్వరలోనే కోవ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.


Tags

Read MoreRead Less
Next Story