Harish Rao : అమిత్షా అబద్ధాలకు బాద్షా : హరీష్ రావు
Harish Rao : కేంద్రమంత్రి అమిత్షా అబద్ధాలకు బాద్షాగా మారిపోయారన్నారు మంత్రి హరీష్రావు. తెలంగాణలో అభివృద్ధిని చూడలేని బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. అమిత్షా మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటీ నిజం లేదన్నారు. మిషన్ భగీరథకు పైసా విదల్చని కేంద్రం ఇవ్వని దానిని ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అమిత్షాపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. దేశవ్యాప్త ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమన్న ఆయన.. అధికారం ఉందని ఏదైనా మాట్లాడతామంటే చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్రానికి దమ్ముంటే ఒకేసారి ఎన్నికలకు పోదామని.. గెలుపెవరిదో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. గుజరాత్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఇక బీజేపీ నేతలవి బోగస్ మాటలంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కళ్లుండి చూడలేని కబోదులు బీజేపీ నేతలంటూ మండిపడ్డారు.
ఇక అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ అటాక్ ఇచ్చారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు. ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టుల సీజన్ కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. వచ్చాడు.. తిన్నాడు.. వెళ్లాడు అంటూ అమిత్ షాను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 8 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఏమి ఇవ్వలేదని.. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అంటూ తీవ్రంగా విమర్శించారు. అటు నాగార్జునసాగర్ హాలీయా సభలోనూ రాహుల్గాంధీని టార్గెట్ చేశారు కేటీఆర్. క్లబ్లు, పబ్లు తప్ప రాహుల్గాంధీకేమీ తెలియదని, ఎన్నికలు రాగానే వస్తుంటారు.. మాయమాటలు చెప్పి వెళ్తారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి అమిత్ షా కు ఏం తెలుసన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ను అమిత్ షా చదివారని ఎద్దెవా చేశారు.తుక్కుగూడ సభలో అమిత్ షా చెప్పినవన్ని అబద్ధాలేనన్నారు సబితా ఇంద్రారెడ్డి. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు సబితా ఇంద్రారెడ్డి. వంటా వార్పులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com