హైదరాబాద్ లో రెచ్చిపోయిన మందుబాబులు..!
హైదరాబాద్ లో మందుబాబులు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకునే క్రమంలో ఏకంగా పోలీసులనే కారుతో ఢీకొట్టారు. ఈ ఘటన కూకట్ పల్లి నిజాంపేట్ లో చోటుచేసుకుంది. రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా.. కారులో వెళ్తున్న సృజన్ అనే యువకుడు పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నంలో వెనక ఉన్న మరో కారును ఢీకొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న హోంగార్డును ఢీకొట్టడంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న ఏఎస్ఐ మైపాల్ రెడ్డి స్పాట్ కు వచ్చి ఆరా తీస్తుండగా అస్లాం అనే కారు డ్రైవర్ ఆయనను ఢీకొట్టాడు. దీంతో ఏఎస్ఐ తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ రెండు ప్రమాదాలపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఇరువురి యువకులను అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com