కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : సీఎం కేసీఆర్
KCR : అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు, కుమ్రం భీమ్ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం కేసీఆర్. మా గూడెం, మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీల తర తరాల ఆకాంక్షను ప్రభుత్వం నిజం చేసిందని తెలిపారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీమ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు కేసీఆర్. ఆదివాసీల అభివృద్ది సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కొమ్రం భీమ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు.
అమరుడు కొమ్రం భీమ్ పోరాట ప్రదేశం జోడేఘాట్ను అన్ని హంగులతో అభివృద్ది పరిచామన్నారు కేసీఆర్. కొమురం భీమ్ స్మారక చిహ్నం, స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, భీమ్ పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియపరిచే విధంగా, అన్ని మౌలిక వసతులను జోడెఘాట్లో ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఆదివాసీ భవన్ నిర్మాణం చేపట్టామని, అది ప్రారంభోత్సవానికి సిద్దమైందన్నారు. జల్ జంగల్ జమీన్ అనే కొమ్రం భీమ్ నినాదంలోని స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ.. స్వరాష్ట్ర అభివృద్ధి పథంలోనూ ఇమిడి ఉందన్నారు సీఎం కేసీఆర్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com