Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఏసీబీ రిపోర్ట్‌తో నేతలకు దడ


AA

* ఎవరెవరికి ఎంత లంచం ఇచ్చామో పుస్తకాల్లో రాసిన సిండికేట్లు
* వ్యాపారి రమణ వాంగ్మూలంతో నేతల్లో కలవరం
* మోపిదేవికి 10 లక్షలు ఇచ్చామన్న రమణ
* ఆరోపణలు అవాస్తవమన్న మంత్రి మోపిదేవి
* రాజీనామాకు సిద్దమన్న మంత్రి మోపిదేవి

ఎక్సైజ్‌ శాఖా మంత్రినే సిండికేట్లు షేక్‌ చేస్తున్నాయ్‌. లక్షల్లో ముడుపులిచ్చామంటూ ఇరుకునపెడ్తున్నాయ్‌. తాజాగా ఏసీబీ రిమాండ్‌ రిపోర్ట్‌లో బయటపెట్టిన నిజాలు.... నాయకుల్ని, అధికారగణాన్ని పరుగులు పెట్టిస్తున్నాయ్‌. ఓ సిండికేట్‌ నుంచి మంత్రి మోపిదేవికి పదిలక్షల ముడుపులు అందాయన్న ఏసీబీ రిపోర్ట్‌తో ప్రతిపక్షాలకు అస్త్రం దొరికనట్టైంది.

లిక్కర్‌ సిండికేట్ల కిక్కు ఇప్పుడు క్యాబినెట్‌ను తాకింది. నషాళానికెక్కి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాలో లిక్కర్‌డాన్‌లపై ఉక్కుపాదం మోపిన ఏసీబీ వెలికితీసిన నిజాలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయ్‌. అధికారులతో పాటు అమాత్యులకు సైతం ముడుపులు చెల్లించినట్లు మద్యం వ్యాపారి ఇచ్చిన వాగ్మూలం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో వైన్‌ సిండికేట్లను శాసిస్తున్న మద్యం వ్యాపారి రమణను ఏసీబీ టార్గెట్‌ చేసింది.

సోదాల్లో కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకొని అరెస్ట్‌ చేసింది. ఇక్కడే అసలు చిత్రం బయటపడింది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఎకౌంట్‌ బుక్స్‌లో ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ఇచ్చారో సవివరంగా దొరికింది. సాక్షాత్తు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణకు చంద్రావైన్స్‌ బాబ్జి ద్వారా పది లక్షలు సమర్పించినట్లు ఎకౌంట్స్‌లో కనుగొన్నారు. ఇదే విషయాన్ని ఏసీబీ రిమాండ్‌ రిపోర్ట్‌లోనూ స్పష్టం చేసింది.

అయితే తాను ఎవరి దగ్గర ఎలాంటి ముడుపులు తీసుకోలేదంటున్నారు మంత్రివర్యులు. సిండికేట్లతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్దమన్న ఆయన రాజీనామాకు సైతం వెనుకాడబోనన్నారు. ఇదిలా ఉంటే ముడుపుల వ్యవహారంలో మద్యవర్తిగా ఉన్న బాబ్జి..... రమణతో సంబంధం లేదని, తన ద్వారా ఎవరికీ లంచం ఇవ్వలేదని అంటున్నారు. సాక్షాత్తు మంత్రికే కళంకం రావడంతో విపక్షాలు ఫైరవుతున్నాయి.

మోపిదేవిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయంలో సీఎం సీరియస్‌గా స్పందించకపోతే ఆయనకు ఈ కళంకాన్ని ఆపాదించాల్సి వస్తుందంటోంది టీడీపీ. మొత్తం మీద ఈ మద్యం ముడుపుల వ్యవహారం ఎంత వరకు వెళ్తుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Published Date : Wednesday, 8/2/2012 10:07 AM IST
Related Articles
Gallery