యుద్ధతంత్రాన్ని శాసించే టెక్నాలజీలో కీలక దశను దాటిన భారత్

యుద్ధతంత్రాన్ని శాసించే టెక్నాలజీలో కీలక దశను దాటిన భారత్

చైనా నుంచి ఎదురయ్యే హైపర్‌సోనిక్‌ ఆయుధ ముప్పును ఎదుర్కొనేందుకు మన దేశం కూడా వేగంగా పావులు కదుపుతోంది..భవిష్యత్తులో యుద్ధతంత్రాన్ని శాసించే ఈ టెక్నాలజీలో భారత్‌ కీలక దశను దాటింది. ఇప్పటికే పొరుగున ఉన్న డ్రాగన్‌ చెంతకు ఈ టెక్నాలజీ చేరి కొన్నేళ్లవుతుంది. దీంతో భారత్‌ కూడా ఆ టెక్నాలజీని సొంతం చేసుకునేందుకు చేస్తున్న కృషి ఫలించింది..హైపర్‌సోనిక్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది.

ఏదైనా ఆయుధం శబ్ధవేగానికి ఐదు రెట్ల వేగంతో ప్రయాణిస్తే దానిని హైపర్‌సోనిక్‌గా ఆయుధంగా పేర్కొంటారు. అంటే మాక్‌5 స్పీడ్‌ అన్నమాట. ఈహైపర్‌సోనిక్‌ ఆయుధాల్లో బాలిస్టిక్‌ క్షిపణుల్లో ఉండే వేగం.. క్రూజ్‌ క్షిపణుల్లో వలే మార్గం మార్చుకొనే లక్షణాలు ఉంటాయి. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా భావిస్తారు. వీటిల్లో అత్యంత శక్తివంతమైన స్క్రాంజెట్‌ ఇంజిన్లను వాడటంతో విపరీతమైన వేగాన్ని అందుకొంటాయి. ఈ ఇంజిన్లు వాతావరణం నుంచి ఆక్సిజన్‌ను పీల్చుకొని దానిలోని హైడ్రోజన్‌ ఇంధనంతో కలిపి శక్తిని సృష్టిస్తాయి. దీని సాయంతో అవి మాక్‌5 స్పీడ్‌ను అందుకొంటాయి.

హైపర్‌సోనిక్‌ ఆయుధాలను ప్రత్యేక పరిస్థితుల్లో వినియోగిస్తారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఛేదించుకొని లక్ష్యాలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తారు. వీటి ద్వారా అణ్వాయుధాలను కూడా ప్రయోగించవచ్చు. సుదూర లక్ష్యాలను ఛేదించవచ్చు. 2011లో అమెరికా విజయవంతంగా అడ్వాన్స్‌డ్‌ హైపర్‌సోనిక్‌ ఆయుధాన్ని పరీక్షించింది. ఇది 3,700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించింది. చైనా, రష్యాలు కూడా ఈ టెక్నాలజీలో బాగా ముందంజలో ఉన్నాయి.

భారత్‌ గత ఏడాది హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ వెహికల్‌ను పరీక్షించింది. అగ్ని-1 క్షిపణి ప్లాట్‌ఫామ్‌పై చేసిన ఈ ప్రయోగం విఫలమైంది. తాజాగా సోమవారం చేసిన ప్రయోగం విజయవంతమైందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు. జపాన్‌ కూడా దేశీయంగా ఇటువంటి హైపర్‌సోనిక్‌ ఆయుధం తయారీపై దృష్టిపెట్టింది. దీంతో ఆసియాలో హైపర్‌సోనిక్‌ ఆయుధపోటీ తీవ్రమైంది..

Tags

Read MoreRead Less
Next Story