కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఘోరంగా పరిస్థితులు.. ఒక వాటర్ బాటిల్ రూ.3 వేలు, ప్లేట్‌ భోజనం రూ.7000..!

కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఘోరంగా పరిస్థితులు.. ఒక వాటర్ బాటిల్ రూ.3 వేలు, ప్లేట్‌ భోజనం రూ.7000..!
మరో ఐదు రోజులు. అమెరికా సంకీర్ణ దళాలు ఆఫ్గానిస్తాన్ నుంచి పూర్తిగా వెనుతిరిగితే అక్కడి పరిస్థితులు ఇప్పుడు ఉన్నదానికంటే ఘోరంగా, భయంకరంగా మారబోతున్నాయి.

మరో ఐదు రోజులు. అమెరికా సంకీర్ణ దళాలు ఆఫ్గానిస్తాన్ నుంచి పూర్తిగా వెనుతిరిగితే అక్కడి పరిస్థితులు ఇప్పుడు ఉన్నదానికంటే ఘోరంగా, భయంకరంగా మారబోతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేశారనే సమాచారంతో.. అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ తమ పౌరులకు తాజాగా హెచ్చరికలు చేశాయి. వీలైనంత త్వరగా కాబుల్ నుంచి బయటపడాలని లేదంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాయి.

ఆగస్టు 15న తాలిబన్ల ఆక్రమణ మొదలైన నాటి నుంచి నేటి వరకూ కాబుల్ విమానాశ్రయం నుంచి 90 వేల మందికి పైగా ఆఫ్గాన్లు, విదేశీయులు వలస వెళ్లిపోయారు. శరణార్థులుగా దేశ సరిహద్దులు దాటి పొరుగున తలదాచుకున్న వారు లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో 4 వేల మంది అమెరికా సైనికులు పహారా కాస్తున్నారు. సరైన పత్రాలతో ఉన్న వారిని ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతిస్తూ వారు ఇతర దేశాలకు వెళ్లేందుకు సాయం చేస్తున్నారు. ఐతే.. కాబుల్‌లో ఉగ్రదాడులు జరగొచ్చనే హెచ్చరికలతో ఫ్రాన్స్, బ్రిజిల్ సహా మరికొన్ని దేశాలు ఇవాళ్టి నుంచి విమాన సర్వీసులు నిలిపివేశాయి.

కాబుల్‌ ఎయిర్‌పోర్టు బయట ప్రస్తుత దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. 3 గేట్ల వద్ద వేలాది మంది పడిగాపులు పడుతున్నారు. తాము దేశం విడిచి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ కన్నీటితో వేడుకుంటున్నారు. అటు.. ఈ ప్రాంతంలో ఇప్పుడు వాటర్ బాటిల్ కొనాలన్నా 29 పౌండ్లు అంటే 3 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అదే ప్లేట్‌ భోజనం అయితే 7 వేలకుపైనే. పైగా ఆఫ్గాన్ కరెన్సీని ఎవరూ తీసుకోవడం లేదు. డాలర్లు, పౌండ్లలో చెల్లిస్తేనే అవయనా దొరుకుతున్నాయ్. పరిస్థితి అంతకంతకూ దిగజారుతున్న స్థితికి ఈ దృశ్యాలన్నీ అద్దం పడుతున్నాయి. అటు, సెప్టెంబర్ చివరికల్లా దేశవ్యాప్తంగానూ ఆహారానికి అల్లాడే పరిస్థితులు వస్తాయని UN ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రోజురోజుకూ విమాన సర్వీసులు తక్కువైపోతున్నాయి. ఎయిర్‌పోర్టు దగ్గర చూస్తే వేలాది మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితులు అత్యంత ఘోరంగా కనిపిస్తున్నాయి. విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న మురుగుకాల్వలో సైతం దిగి ఏదో రకంగా లోపలికి వెళ్లేందుకు అక్కడి వాళ్లు ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. అటు, ఆఫ్గాన్ పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు వీల్లేదంటూ హుకూం జారీ చేసిన తాలిబన్లు.. ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారుల్ని మూసేశారు. విదేశీయులకు మాత్రమే బయటకు వెళ్లే అవకాశం ఇస్తున్నారు. ఆఫ్గాన్‌కు చెందిన డాక్టర్లు, టీచర్లు, ఇంజనీర్లు వలసపోవడానికి వీల్లేదంటూ తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ హెచ్చరికలు చేస్తుండడంతో వేల మంది ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story