జీవీఎంసీ మేయర్‌ ఎవరు..? విశాఖలో సర్వత్రా చర్చ.. !

జీవీఎంసీ మేయర్‌ ఎవరు..? విశాఖలో సర్వత్రా చర్చ.. !
ఏపీలోనే అతిపెద్ద నగరం విశాఖ. పద్నాలుగేళ్ల తర్వాత గ్రేటర్‌ విశాఖకు ఎన్నికలు జరిగాయి. నగర పరిధిలోని 98 డివిజన్‌లలో అధికార పార్టీ వైసీపీ అత్యధిక స్థానాలు గెల్చుకుంది.

ఏపీలోనే అతిపెద్ద నగరం విశాఖ. పద్నాలుగేళ్ల తర్వాత గ్రేటర్‌ విశాఖకు ఎన్నికలు జరిగాయి. నగర పరిధిలోని 98 డివిజన్‌లలో అధికార పార్టీ వైసీపీ అత్యధిక స్థానాలు గెల్చుకుంది. 58 సీట్లు వైసీపీ కైవసం చేసుకోగా... 30 చోట్ల టీడీపీ విజయం సాధించింది. మూడు డివిజన్లలో జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కో డివిజన్‌లో గెలుపొందాయి.

ఎన్నికల సమయంలో టీడీపీ మేయర్‌ అభ్యర్థిని ముందే ప్రకటించింది. 98వ డివిజన్‌లో పోటీ చేసిన పీలా శ్రీనివాస్‌ మేయర్‌ అభ్యర్థి అని... టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ప్రకటించారు. పీలా శ్రీనివాస్‌ 6290 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. కానీ... అనూహ్యంగా జీవీఎంసీలో అత్యధికంగా 58 స్థానాల్ని దక్కించుకుంది.

అయితే మేయర్‌ అభ్యర్థి ఎవరనే విషయంలో వైసీపీలో స్పష్టత రావడం లేదు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పార్టీ నేత వంశీకృష్ణకు 2019లో జగన్‌ టికెట్‌ ఇవ్వలేదు. మేయర్‌గా గానీ ఎమ్మెల్సీగా గానీ అవకాశం కల్పిస్తామని చెప్పారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 21వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ విజయం సాధించారు.

గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ.. జగన్‌పై నమ్మకంతో వంశీకృష్ణ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బరిలో నిలిచారు. విశాఖ అధ్యక్షుడిగానూ పని చేశారు. అయితే.. జగన్‌ మాట నిలబెట్టుకుని వంశీకృష్ణకు మేయర్‌గా అవకాశం కల్పిస్తారా.. లేక వేరే ఏదైనా పేరు తెరపైకి వస్తుందా అనేది ఈ నెల 18న తేలిపోనుంది.

ఓ మహిళకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేయర్‌ పదవి విషయంలో వైసీపీలో స్పష్టత కొరవడింది.

Tags

Read MoreRead Less
Next Story