ఉగ్రవాదంపై చర్చిస్తాం: మోదీ

ఉగ్రవాదంపై చర్చిస్తాం: మోదీ

brics

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ బ్రెజిల్ వెళ్లారు. ఎకనామిక్ గ్రోత్ ఫర్ యాన్ ఇన్నోవేటివ్ ఫ్యూచర్ అనే అంశంపై 11వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా డిజిటల్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి కావాల్సిన సహాయ సహకారాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతేకాకుండా ప్రపంచంలోని ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా దృష్టి సారించినట్లు మోదీ పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రధాని మోదీ ఐదు సార్లు బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. ఇది ఆరోసారి.

బ్రిక్స్ సదస్సు అనంతరం ప్రధాని మోదీ.. బ్రెజిల్ జెయిర్ బోల్సోనారో తో సమావేశం కానున్నారు. తొలుత బ్రెజిల్ అధ్యక్షుడితో భేటీ కానున్న ప్రధాని.. భారత్, బ్రెజిల్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నట్లు మోదీ వివరించారు. బ్రిక్స్ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో మన వ్యాపార, పారిశ్రామిక రంగాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ సదస్సులో భాగంగా బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తానని.. తరువాత బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో విడిగా భేటీ అవుతాను అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వీటితో పాటుగా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లతో ప్రధాని మోదీ విడిగా భేటీ అయి చర్చించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story