కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ రెడీ!
కరోనా వైరస్ ప్రభావం భారత్లో క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ కొత్త 4 కేసులు నమోదయ్యాయి. దాంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37కు పెరిగింది. ఒడిశాలో మొదటి కరోనా కేసును రిజిస్టర్ చేశారు. ఇటలీ నుంచి వచ్చిన ఓ యువకునికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఐఐటీ రూర్కీలో ఓ ఫారిన్ స్టూడెంట్తో పాటు 8 మంది భారతీయ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్కు పంపించారు. బిహార్లోని దర్బంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి అనుమానిత కరోనా రోగి తప్పించుకున్నాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
కరోనా ఎఫెక్ట్తో రాష్ట్రాలు నెమ్మదిగా నిర్బంధంలోకి వెళ్లిపోతున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్, నైట్ క్లబ్బులు, పబ్బులను క్లోజ్ చేశారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. 50 మందికి మించి ప్రజలు గుమికూడే అన్ని రకాల కార్యక్రమాలను మార్చ్ 31 వరకు నిషేధించారు. దేశ రాజధాని పరిధిలో జిమ్లు, స్పాలు, నైట్ క్లబ్బులు, థియేటర్లు, వారాంతపు సంతలను మూసివేయాలని ఆదేశించింది. కేరళలోనూ అన్ని విద్యాసంస్థలకు మార్చ్ 31 వరకు సెలవులు ఇచ్చారు. జమ్మూకశ్మీర్లోనూ వైరస్ భయం పెరుగుతోంది. శ్రీనగర్లోని అన్ని పార్కులు, గార్డెన్లను మూసివేశారు. మరోవైపు విదేశాల నుంచి భారతీయులను వెనక్కి రప్పించే పని కొనసాగుతోంది.
ఇక కరోనాతో 150కిపైగా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీని బాధితులు లక్షా 69వేలకు చేరగా.. 6వేల ఐదు వందల మందికి పైగా మృతి చెందారు. ఐరోపా దేశాలు, అమెరికాలలో కోరలు చాచింది. అమెరికాలో మృతుల సంఖ్య 68కి చేరింది. అక్కడ 3 వేలకు పైగా కేసులు నమోదవడంతో దక్షిణ-ఉత్తర అమెరికా మధ్య సరిహద్దులను మూసివేశారు. న్యూయార్క్, మసాచుసెట్స్, ఓహియో, వాషింగ్టన్, ప్యూర్టోరికో, బోస్టన్, కాలిఫోర్నియాల్లో స్కూళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేశారు. న్యూజెర్సీలో కర్ఫ్యూ విధించారు.
అటు.. ఇటలీలో 18 వందల మందికి పైగా మృతి చెందారు. దాంతో ఇటలీ మొత్తాన్ని నిర్బంధించారు. 6 కోట్ల మందిని ఇళ్లకే పరిమితం చేశారు. స్పెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ 292 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్లో కరోనా విజృంభణ తారాస్థాయిలో ఉంది. ఏకంగా 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు 127 మంది మరణించారు. బ్రిటన్లోనూ పరిస్థితి సీరియస్గా ఉంది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. జర్మనీలోనూ కేసుల సంఖ్య 5 వేలకు చేరింది. అటు.. దక్షిణ కొరియా, ఇరాన్లలో పరిస్థితి కాస్త మెరుగుపడుతోంది. మృతులు, బాధితుల సంఖ్య కొద్దికొద్దిగా తగ్గుతోంది. ఇరాన్లో దాదాపు 4వేల 600 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్కు వాక్సిన్ రెడీ చేసింది అమెరికా. రోచ్ మెడికల్ కంపెనీ వచ్చే ఆదివారం కరోనా వాక్సిన్ రిలీజ్ చేస్తుందని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. లక్షల వాక్సిన్ డోస్లు రెడీ ఉన్నాయని ప్రకటించారు. ఈ వాక్సిన్ వస్తే కరోనా వైరస్కు అంతం పలికినట్లేనంటున్నారు ట్రంప్.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com