ఇండియన్ ఆర్మీకి అమ్మాయిలను ఎరగా వేసి..
పాక్ తోక వంకర అని మరోసారి రుజువు చేసుకుంటోంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే.. సైనిక స్థావరాలు గుట్టు లాగేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం నీచానికి తెగబడుతోంది. ఇండియన్ ఆర్మీకి అమ్మాయిలను ఎరగా వేస్తోంది.
కంటికి కనిపించే శత్రువుతో యుద్ధం చేయొచ్చు. కానీ.. జిత్తలమారి నక్కను తలపించే వ్యూహాలతో భారత సైన్యం తలపడాల్సి వస్తోంది. సరిహద్దుల్లో.. వాయుమార్గంలో.. ఏరకంగానూ మనకు పాకిస్తాన్ సరిజోడు కాదు. ఈ విషయం సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాపికి బాగా తెలిసొచ్చింది. అందుకే.. ఇతర మార్గాలు అన్వేషిస్తోంది. అందులో ఒకటి హనీట్రాప్.
అమ్మాయిల్ని ఎరగా వేయడమే హనీ ట్రాప్. అలా వగలాడి వలలో పడి కొందరు సోల్జర్స్ గతంలో అరెస్టయ్యారు కూడా. జాగ్రత్తగా ఉండాలని సైనిక అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా కూడా సైన్యానికి ఓ అలర్ట్ జారీ అయింది. పాకిస్తాన్కు చెందిన ISI గూఢచారిగా పనిచేస్తున్న ఓ అమ్మాయి హనీ ట్రాప్ చేసేందుకు రంగంలోకి దిగినట్టు దాని సారాంశం. సోషల్ మీడియా వేదికగా ఆమె టాలెంట్ చూపించింది. ఫేస్బుక్లో 'గుజ్జర్ సౌమ్య' అని, ఇన్స్టాగ్రామ్లో 'ఓయ్సోమ్యా' అని ఖాతాలు తెరిచింది. అవి అనుమానాస్పదంగా ఉండడంతో మిలటరీ ఇంటెలిజన్స్ అధికారులు ఓ కన్నేశారు. ఆ రెండు అకౌంట్లు ఫేక్గా తేల్చారు. మన జవాన్లకు వల వేసి విలువైన సమాచారం రాబట్టే కుట్రలో భాగమని అర్థమయింది.
గుజ్జర్ సౌమ్య అనే వ్యక్తి అమరుడైన కెప్టెన్ పవన్ కుమార్ సోదరిగా చెప్పుకుంటోంది. ఐఐటీ బాంబేలో రీసెర్చ్ స్కాలర్గా ప్రొఫైల్ పేజ్ క్రియేట్ చేసింది. ఆమె ఫేక్ అని స్పష్టమయ్యే సరికి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను రిమూవ్ చేసిందామె. దీంతో.. ఆ ఖాతాలు హనీ ట్రాప్లో భాగంగా క్రియేట్ చేసినవేనని స్పష్టమవుతోంది. శత్రుమూకలు నకిలీ ఖాతాల ద్వారా చొరబడి.. రక్షణ విభాగానికి చెందిన విలువైన సమాచారం రాబట్టే ప్రయత్నం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ తాజా హెచ్చరికలతో జవాన్లు అప్రమత్తం అయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com