రిసార్ట్‌లో ఎమ్మెల్యేలకు రాజభోగాలు

రిసార్ట్‌లో ఎమ్మెల్యేలకు రాజభోగాలు

కర్ణాటక రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది.. అనుక్షణం మారుతున్న పరిణామాలతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.. రెబెల్‌ ఎమ్మెల్యే ఎంబీటీ నాగరాజు యూటర్న్‌ తీసుకోవడం సీన్‌ మొటికొచ్చింది. అటు బలపరీక్షకు సమయం దగ్గర పడుతుండటంతో కూటమి నేతలు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.. కూటమిని కాపాడుకునేందుకు నేతలు పాట్లు పడుతుంటే.. ఇటు రెబెల్స్‌ మాత్రం రిసార్టుల్లో ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు.. సంక్షోభం పుణ్యమా అని రాజభోగాలు అనుభవిస్తున్నారు.

కర్ణాటక రాజకీయలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించిన నాగరాజు యూటర్న్‌ తీసుకున్నారు. ముంబయిలో ఉన్న రెబల్‌ ఎమ్మెల్యేలని కలిసేందుకు అక్కడికి వెళ్లిపోయారు. ఈయనతో పాటు మరో ఎమ్మెల్యే సుధాకర్‌ కూడా వారితో చేరే అవకాశం ఉంది. శనివారం కూటమి పెద్దలందరితో సుధీర్ఘంగా చర్చలు జరిపిన నాగరాజు.... కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ అనూహ్యంగా...ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో కూటమి నేతల చర్చలు వృథా అయ్యాయి.

కాంగ్రెస్-జేడీఎస్‌ సంకీర్ణం నిలుదొక్కుకోవాలన్నా, అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఏకంగా పీఠమెక్కాలన్నా మిగిలింది కొన్ని గంటలు మాత్రమే. ఈ టైమ్‌ అత్యంత కీలకం. ఏ రోజైనా విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానన్న సీఎం కుమారస్వామి తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. మంగళవారం అసమ్మతుల భవిష్యత్తును సుప్రీంకోర్టు నిర్ణయించనుండటంతో... ఆ రోజు జరిగే పరిణామాలు కూడా చాలా కీలకంగా మారాయి. అటు రెబెల్స్‌ను అనర్హత వేటు కూడా భయపెడుతోంది.

విశ్వాస పరీక్షకు సై అన్న సీఎం కుమారస్వామి ఓడిపోతే విషాద ప్రసంగంతో సీఎం పీఠం వీడాల్సిందే. వాస్తవానికి విశ్వాస పరీక్ష గడువు కోరినా అందుకు అనుమతి ఇచ్చేందుకు స్పీకర్‌కు 14 రోజుల సమయం ఉంటుంది. అంత వరకు ఆగకుండానే ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని సభకు వివరించారు. అటు కాంగ్రెస్‌ భరోసా ఇవ్వటంతో బుధవారం తన బలమేమిటో నిరూపించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఈ 2 రోజులు సీఎం కంటే కాంగ్రెస్‌కే ఎంతో కీలకం. ఇప్పటికే బీజేపీకి ఉన్న బలాన్ని దాటేందుకు తలకు మించిన కసరత్తు చేసింది కాంగ్రెస్‌. చివరికి ఎంబీటీ నాగరాజు సైతం యూటర్న్‌ తీసుకోవడంతో... ఆ పార్టీ అంతర్మథనంలో పడింది. అయినా...ధీమా వ్యక్తం చేస్తోంది.

మరోవైపు107 సంఖ్యా బలంతో అంతులేని విశ్వాసం ప్రదర్శిస్తోంది బీజేపీ. అదే సమయంలో లోలోపల టెన్షన్‌ కూడా లేకపోలేదు. ఇప్పటికే ఐదుసార్లు ఆపరేషన్‌ కమల్‌ పేరిట చేతులు కాల్చుకున్న బీజేపీకిఆరో వైఫల్య సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కుమారస్వామికి ఎంత ధైర్యం లేకపోతే విశ్వాస పరీక్షకు సవాలు చేస్తారంటున్నారు. .ఇప్పటికే నగరంలో తిష్టవేసిన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధరరావు ఆరో అరిష్టం నుంచి గట్టెక్కేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. రాజీనామా చేసిన వారి భవిష్యత్తు సుప్రీం కోర్టు తేల్చుతున్నప్పటికీ... అప్పటి వరకు వారిని కాపాడుకోవడం బీజేపీకి పెద్ద సవాలే.

మరోవైపు కర్ణాటక రాజకీయాల్లో శిబిరాల జోరు నడుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికీ జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించాయి. అటు బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంపు రాజకీయాలు స్టార్ట్‌ చేసింది. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు మూడు పార్టీలు వెనకాడకపోవడంతో ఎమ్మెల్యేలు ఎంజాయ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story