టి.కాంగ్రెస్ నేతలు గానీ.. కేడర్ కానీ ఎంజాయ్ చెయ్యలేని పరిస్థితి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలా పడిన కాంగ్రెస్ నేతలకు పార్లమెంట్ ఫలితాలు ఆక్సీజన్లా మారాయి. దేశవ్యాప్తంగా యూపీఏకు ఆశించిన ఫలితాలు రాకపోయినా.. ఇక్కడ మాత్రం సత్తా చాటారు. మూడు స్థానాల్లో గెలిచారు. రెండు చోట్ల స్వల్ప తేడాతో ఓటమి. ఈ ఫలితాలు టి.కాంగ్రెస్కు పెద్ద ఊరట. నేతలు గానీ.. కేడర్ కానీ ఎంజాయ్ చెయ్యలేని పరిస్థితి. లోక్సభ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చెయ్యడం ఇందుకు కారణం. డిల్లీ పరిణామాలు పార్టీని స్థబ్దతలో పడేశాయి. క్యాడర్ కూడా డీలా పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్నా.. కాలర్ ఎగరేయలేక పోతున్నారు.
మరోవైపు.. ఏఐసీసీ సంక్షోభం కొందరు టి.కాంగ్రెస్ నేతలకు పదవీ గండంగా మారింది. ఏఐసీసీ ప్రక్షాళన చేపడితే కొందరు పదవులు కోల్పోయే పరిస్థితి ఉంది. తెలంగాణ నుంచి ఎనిమిది మంది కీలక పదవుల్లో ఉన్నారు. ఐదుగురు ఏఐసీసీ కార్యదర్శలు.. ఇద్దరు అధికార ప్రతినిధులు.. ఒకరు కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. ఇటు.. పీసీసీ కూడా రద్దై.. తాత్కాలికంగా కొనసాగాల్సి రావొచ్చు. ఢిల్లీలోనే కాదు.. రాష్ట్ర కాంగ్రెస్లోను మార్పులు.. చేర్పులు తప్పకపోవచ్చు. దీంతో అధ్యక్షుడుగా రాహులే కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాకాకుంటే.. కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని వారి వాదన. ఓటమి తాత్కాలికమని.. ఇందిర హయాం పరిణామాలను గుర్తుచేస్తున్నారు. సీనియర్లు, జూనియర్ల కలయికతో రాహుల్ టీం కొనసాగాలని కోరుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కు చెక్ పెట్టామనే సంతోషంలో ఉన్న టి-కాంగ్రెస్కు ఏఐసీసీ సంక్షోభం కునుకు లేకుండా చేస్తోంది. ఈ పరిణామాలకు ఎంత తొందరగా ఫుల్స్టాప్ పడితే అంత మంచిదని భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com