17 ఏళ్ల వయసులో మోదీ తీసుకున్న ఓ నిర్ణయం..

17 ఏళ్ల వయసులో మోదీ తీసుకున్న ఓ నిర్ణయం..

ధగధగలాడే బంగారానికైనా సమ్మెట పోటు తప్పదు. మోదీ జీవితం కూడా అంతే. ఆయన ప్రధాని స్థాయికి చేరడానికి.. చిన్నతనంలో అనుభవించిన కష్టాలు పాఠాలెన్నో నేర్పాయి. అందుకే ఓ ఛాయ్ వాలా.. దేశాన్ని నడిపించే నాయకుడిగా ఎదిగారు. 17 ఏళ్ల వయసులో మోదీ తీసుకున్న ఓ నిర్ణయం ఆయన లైఫ్ ను ఎలా మార్చింది?
నరేంద్రమోదీ కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా గుజరాత్ రాష్ట్రాన్ని పాలించే శక్తిగా ఆయన ఎదిగారు. 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించారు. వెనుకబడిన రాష్ట్రాన్ని ప్రజానుకూల విధానాలతో, చురుకైన పరిపాలనతో పరుగులు పెట్టించారు. అదే దేశంలో ఆ రాష్ట్రాన్ని ప్రముఖ స్థానంలో నిలబెట్టింది.
గుజరాత్ లోని ఉత్తర మెహ్ సనా జిల్లాలోని చిన్న పట్టణం.. వాద్ నగర్. దామోదర్ దాస్ మోదీ, హీరాబా దంపతులకు మూడో సంతానంగా 1950, సెప్టెంబర్ 17న మోదీ జన్మించారు. అప్పటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి మూడేళ్లే అయ్యింది. ఓ చిన్న ఇంట్లో ఆయన కుటుంబం నివసించేది. వజ్రానికైనా మెరుపు రావాలంటే సాన పట్టాల్సిందే. దానికి సమయం పడుతుంది. మోదీ జీవితం కూడా అంతే. అందుకే కుటుంబ జీవనం కోసం.. రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మే దుకాణంలో ఛాయ్ వాలాగా పనిచేశారు. తరువాత దేశానికే ప్రధాని అయ్యారు.

చర్చాగోష్టులు, పుస్తకాలు చదవడం, లైబ్రరీలో గంటలకొద్దీ గడపడం, ఈత కొట్టడం.. ఇవన్నీ మోదీకి చాలా ఇష్టమైన పనులు. అన్నింటికీ మించి కష్టపడే గుణం ఎక్కువ. అనుకున్నది సాధించేవరకు విశ్రాంతి లేదు. విరామం లేదు. బహుశా ఈ లక్షణాలే ఆయనలో ఉన్న నాయకుడిని ఈ భారతావనికి పరిచయం చేశాయి. అవే ఆయనను ఈ స్థాయికి చేర్చాయి.

పిల్లలంటే ఆటలు, పాటలు, అల్లరి.. అంతే. కానీ మోదీ జీవితం వేరు. ప్రముఖ బౌద్ధ కేంద్రంగా ఉండే వాద్ నగర్ లో ఉన్న ప్రభావం కావచ్చు.. చిన్నతనంలోనే జీవితమంటే ఏంటో చూసిన అనుభవం కావచ్చు… సమాజం పట్ల ఆయనకో దృక్పథం ఉండేది. స్వామీ వివేకానందను స్ఫూర్తి ప్రదాతగా కొలిచే మోదీపై ఆయన ప్రభావం ఎక్కువే. భారత్ ను జగద్గురుగా.. అంటే ప్రపంచానికి సారథిగా మార్చాలన్న వివేకానందుడి కలను నెరవేర్చే లక్ష్యం కూడా పెట్టుకున్నారు.

మోదీకి యుక్తవయసు వచ్చేసరికి.. అంటే 17 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచి దేశమంతా తిరిగారు. సుమారు రెండేళ్లపాటు దేశంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ అక్కడి సంస్కృతులను అధ్యయనం చేశారు. అప్పటికే ఆయనలో చాలా మార్పు వచ్చింది. జీవితంలో ఏం సాధించాలో అర్థమైంది. తరువాత అహ్మదాబాద్ వెళ్లి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చేరారు. 1972లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా బాధ్యతలు చేపట్టారు. ఉదయం ఐదు గంటలకు మొదలయ్యే జీవితం.. రాత్రి పొద్దుపోయే వరకు హడావుడిగా ఉండేది. కష్టించే తత్వం అక్కడే అలవడిందని చెప్పుకోవాలి. ఎమర్జెన్సీ సమయంలో.. ప్రజాస్వామ్య పునరుద్దరణ ఉద్యమంలో పాల్గొన్నారు మోదీ.

1980ల్లో ఆర్ఎస్ఎస్ లో కీలకమైన స్థాయికి చేరారు. ఆర్గనైజర్ గా ఎదిగారు. 1987లో గుజరాత్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ప్రజా సేవకు అంతకు మించిన మార్గం లేదని మోదీకి అర్థమైంది. గుజరాత్ లోని బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మోదీ జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేశారు. 1990లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యంత చేరువగా.. అంటే బీజేపీని రెండో స్థానానికి చేర్చారు మోదీ. నిజానికి ఆ ఎన్నికల్లో మోదీ చాణక్యంతో బీజేపీ ఓట్లు బాగా పెరిగాయి. అప్పట్లోనే ఆ పార్టీ 121 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకోగలిగిందీ అంటే అది మోదీ చలవే.

Tags

Read MoreRead Less
Next Story