ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన నీటిగుంట

ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన నీటిగుంట

అటు ఆడుకోడానికి వెళ్లిన ఇద్దరి చిన్నారులను నీటిగుంట మింగేసింది. గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో ఆడుకుంటామని వెళ్లి.. ప్రమాదవశాత్తూ నక్కవాగులోని నీటిగుంటలో పడ్డారు.

చిరుమామిళ్ల గ్రామానికి చెందిన ఆరుద్ర వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి దంపతుల కుమారుడు నాలుగేళ్ల జశ్వంత్‌, మల్లా రామాంజనేయులు, మీనాక్షి దంపతుల కుమారుడు ఏడేళ్ల మణికంఠ ఇద్దరూ మంచి స్నేహితులు.. వేసవి సెలవులు కావడంతో ఇవాళ మధ్యాహ్నం ఇద్దరు కలిసి ఆడుకొనేందుకు గ్రామ సమీపంలోని నక్కవాగు వద్దకు వెళ్లారు. గమనించిన స్థానికులు వారిని మందలించి వాగువద్దకు వెళ్లకూడదంటూ చెప్పి అక్కడినుంచి పంపించారు. అయినా వినకుండా తిరిగి వాగు వద్దకు వెళ్లారు.

వాగుకు ఆనుకుని ఉన్న కుంటలో చేపపిల్లలను పట్టే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ అందులో పడిపోయారు. ఎంతసేపటికీ చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో కుంటలో తేలియాడుతున్న జశ్వంత్‌ మృతదేహాన్ని వారు గుర్తించారు. కొంతమంది స్థానికులు అందులో దిగి వెతకగా మణికంఠ మృతదేహం కూడా లభించింది. చిన్నారుల మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story