స్టూడెంట్స్ప్రదర్శించిన బ్యానర్‌ చూసిన జగన్.. వాళ్లను పిలిచి..

స్టూడెంట్స్ప్రదర్శించిన బ్యానర్‌ చూసిన జగన్.. వాళ్లను పిలిచి..

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విశాఖలోని శారదాపీఠానికి వచ్చిన జగన్‌ మోహన్ రెడ్డికి.. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. అక్కడి రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు యాగం నిర్వహించిన నేపథ్యంలో.. గెలిచాక సీఎంగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.. జగన్.

అనంతరం.. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలిశారు ముఖ్యమంత్రి. పాదాభివందనం చేసిన సీఎంను.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు స్వామీజి. ముద్దుపెట్టి ఆశీర్వదించారు. వైఎస్సార్‌ కంటే మంచి పాలన అందించాలని.. ప్రజలంతా వెన్నంటే ఉంటారని జగన్‌ను ఆశీర్వదించారు. స్వామి స్వరూపానంద-జగన్‌ మధ్య గంటసేపు ఏకాంత చర్చలు జరిగాయి. పాలనపై, కేబినెట్ ఏర్పాటుపై సలహాలు, సూచనలు తీసుకున్నట్టు సమాచారం. అనంతరం.. ఎయిర్‌పోర్టుకు తిరుగు ప్రయాణం అయ్యారు సీఎం.

ఎయిర్‌పోర్టులోకి వీఐపీ గేట్ నుంచి వెళ్లబోతుండగా.. కొందరు విద్యార్థులు సేవ్‌ నీరజ్‌ అని ప్రదర్శించిన బ్యానర్‌ చూసి ఆగారు. వాళ్లను పిలిచి విషయం కనుక్కోగా.. తమ స్నేహితుడు నీరజ్‌ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నాడని.. 20 రోజుల్లో ఆపరేషన్‌ చేయకపోతే కష్టమని.. రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుందని వాళ్లు చెప్పారు. వెంటనే స్పందించిన జగన్.. ఆ విద్యార్థికి సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అంతకుముందు.. విశాఖ వచ్చిన జగన్‌కు ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి శారదాపీఠం వరకు బ్యానర్లతో నింపేశారు.

Tags

Read MoreRead Less
Next Story