ఆపరేషన్ కమలం..కాంగ్రెస్ ఎమ్మెల్యేల చూపు బీజేపీ వైపు
కర్నాటకలో అస్థిరతకు చెక్ పెట్టడానికి కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రయత్నాలు ప్రారంభించిందా? కొత్త ఎత్తుగడతో రాజకీయ సంక్షోభానికి బ్రేక్ వేయబోతోందా? కర్నాటక సంకీర్ణం ముందున్న తాజా ప్లానేంటి? కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం కొలువైనప్పటి నుంచి అన్ని కష్టాలే. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమలం... కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి నిద్రపట్టకుండా చేస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైన పడిపోవచ్చంటూ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లకు తోడు కమలంవైపు కూటమి ఎమ్మెల్యేలు చూస్తుండడం కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో అలజడి రేపుతోంది. దీంతో ఇరు పార్టీలు అప్రమత్తమయ్యాయి.
కర్నాటకలో బీజేపీ వ్యూహాలకు చెక్పెట్టేలా కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మంత్రి వర్గ విస్తరణపై దృష్టి పెట్టింది. అసంతృప్తులను బుజ్జగించేలా, ప్రభుత్వంలో కీలకంగా మారిన స్వంతంత్రులకు పెద్ద పీట వేసేలా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమలంకు.. మంత్రి వర్గ విస్తరణే సరైన విరుగుడుగా భావిస్తోంది కూటమి.
ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 6న విస్తరణ ఉంటుందని సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, నాగేశ్లతో పాటు మరికొంత మందికి మాత్రమే కేబినెట్లో చోటు లభించనుంది.ప్రస్తుతం కాంగ్రెస్ కోటాలో ఖాళీగా ఉండే రెండు స్థానాలను మాత్రమే స్వతంత్రుల ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు జేడీఎస్ కోటాలో ఖాళీగా ఉండే ఒక స్థానంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం, తగినన్ని ఖాళీలు లేని కారణంగా... కేవలం స్వతంత్రులకే పరిమితం చేస్తారా? లేక మరికొందరిని కేబినెట్లోకి తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com