ప్రైవేట్ ట్రావెల్స్లో అగ్ని ప్రమాదం..బస్సులో 53 మంది ప్రయాణికులు
కర్నూలు జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్యాపిలి మండలం ఏనుగుమర్రి దగ్గర జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్థమైంది. ప్రమాదాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన డ్రైవర్... గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను లేపి కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. కొంత మంది ప్రాణాలను రక్షించుకునే క్రమంలో బస్సు అద్దాలు ధ్వంసం చేసి కిందకు దూకారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంతో అంతా ఉలిక్కిపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 53 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటల్లో లగేజి, వస్తువులు మొత్తం కాలి బూడిదయ్యాయి. దాదాపు కోటికిపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. స్పాట్కు చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు.
తెలంగాణకు చెందిన ఎల్లో ట్రావెల్స్ బస్సుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ తెల్లవారు జామున 4 గంటల 5 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com