తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు
టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మధ్యాహ్నం నుంచి తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో హై టెన్షన్ నెలకొంది.
సీఎల్పీని టిఆర్ఎస్లో విలీనం చేసే ప్రక్రియను నిరసిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి.. సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, అంజన్కుమార్ యాదవ్, తదితరులు గాంధీ విగ్రహం ఎదుట నేలపై కూర్చొని ఆందోళనకు దిగారు. నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ నేతలకు తోడు.. భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఇంకాస్త ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తమ్, భట్టి, శ్రీధర్బాబు, అద్దంకి దాయకర్, పొన్నాల సహా ఇతర నేతలను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ అన్ని గేట్లకు తాళాలు వేసిన పోలీసులు.. గేట్-1 నుంచి ఉత్తమ్,భట్టి,శ్రీధర్బాబును అరెస్ట్ చేసి.. టప్పాచబుత్ర పీఎస్కు తీసుకెళ్లారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. అసెంబ్లీ ముందు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఆయన ఆందోళనతో హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు..
స్పీకర్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమకు స్పీకర్ కనబడటం లేదని.. కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. సీఎల్పీని విలీనం చేసే హక్కు స్పీకర్కు లేదన్నారు. అసలు వారికి సీఎల్పీ మీటింగ్ పెట్టే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో.. విలీనం ఎలా చేస్తారని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించిన ఆయన శుక్రవారం హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com