ఎండలతో అల్లాడుతున్న జనాలకు చల్లటి కబురు
ఎండలతో అల్లాడుతున్న జనాలకు ప్రకృతి చల్లటి కబురు అందించింది. గత వారం రోజులుగా ఎదురుచూస్తున్న నైరుతీ రుతుపవనాలు ఈ రోజు భారత తీరాన్ని తాకాయి. కేరళకు రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ శాఖ- IMD పేర్కొంది. ఈ రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో కేరళలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాబోయే నెలరోజుల్లో నైరుతీ రుతుపవనాలు దేశమంతటికీ విస్తరిస్తాయని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. నైరుతీ రుతుపవనాలతో ఈ ఏడాది సాధరణ వర్షపాతమే నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో రుతుపవనాల వల్ల 96 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రుతుపవనాల రాకతో రానున్న రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com