చీరన్నాడు.. దోచేశాడు
ఆన్లైన్లో ఆఫర్లు టెమ్ట్ చేస్తుంటాయి. ఇక మగువల మనసు దోచే చీరలంటే వార్డ్రోబ్లో ఎన్ని ఉన్నా మనసు లాగేస్తుంటుంది. కూకట్పల్లికి చెందిన ఓ యువతి ఆన్లైన్లో చీరలు కొందామని ఓ వెబ్సైట్ సెలక్ట్ చేసుకుంటోంది. అది చూస్తుండగానే మరింత ఆకర్షణీయమైన చీరలు మరో వెబ్సైట్ లింక్ దర్శనమిచ్చింది. ఆ చీరలు విపరీతంగా నచ్చేయడంతో వెంటనే ఆ సైట్లోకి లాగిన్ అయింది. కొన్ని చీరలను సెలక్ట్ చేసుకుంది. తరువాత వెబ్సైట్లో సూచించిన విధంగా బ్యాంకు అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్తొ సహా ఇతర వివరాలన్నీ అందులో ఎంటర్ చేసింది. ఈ క్రమంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మేడమ్.. మీ ఆర్డర్ చేరింది. మా సైట్లో చీరలు కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పాడు. మీ మొబైల్కు మెసేజ్ చేస్తాం. అందులో ఉన్న అంకెలను చెబితే ఆర్డర్ ఓకే చేసుకుంటామని నమ్మించాడు. ఇంతలో మెసేజ్ రానే వచ్చింది. మరో ఆలోచన లేకుండా వారు అడిగిన నెంబర్ చెప్పింది. క్షణాల్లో తన ఖాతా నుంచి రూ.40వేలు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఒక్కసారిగా షాక్కి గురైన ఆమె వెంటనే తేరుకుంది.
సైబర్ క్రైమ్ గురించి కాస్త అవగాహన ఉండడంతో వెంటనే తన ఖాతా ఉన్న యాక్సెస్ బ్యాంక్కి వెళ్లింది. జరిగిన విషయం బ్యాంకు అధికారులతో చెబతుండగానే మరో రూ.60 వేలు ట్రాన్స్ఫర్ అయినట్లు మరో మెసేజ్ వచ్చింది ఆమె ఫోన్కి. బ్యాంకు వారికి ఆమెసేజ్ చూపించింది. ఖాతాలోని సొమ్ము యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా బదిలీ అయినట్లు గుర్తించి ఆమె ఖాతాను బ్లాక్ చేశారు. బాధితురాలు సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు టెక్నికల్ ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. నేరానికి పాల్పడింది బీహార్ నుంచి కోల్కతాలో సెటిల్ అయిన ముఠాగా గుర్తించారు. ఏదైనా వస్తువుని ఆన్లైన్లో ఆర్డర్ చేసే క్రమంలో బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్లను టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. క్షణాల్లో గూగుల్ పే, పేటీఎం లాంటి ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించే వ్యాలెట్లను సృష్టిస్తున్నారు. లావాదేవీలు చేయడానికి అవసరమైన యూపీఐ నెంబర్ క్రియేట్ చేయడం కోసం ఒకే ఒక్కసారి ఓటీపీ అవసరం అవుతుంది. కేవలం దాన్ని తెలుసుకోవడం కోసమే సైబర్ నేరగాళ్లు బాధితులకు పోన్ చేస్తున్నారు. ఆర్డర్ ఓకే కోసం అని నమ్మించి ఓటీపీ తెలుసుకుంటున్నారు. నెంబర్ చెప్పగాలో అకౌంట్లోని డబ్బు గోవిందా. బాధితులు గుర్తించి అకౌంట్ని బ్లాక్ చేయించేంతవరకు అందినంత ఊడ్చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. అపరిచితుల ఫోన్ కాల్స్కు స్పందించొద్దని, ఎలాంటి వివరాలు అడిగినా చెప్పొద్దని సూచిస్తున్నారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com