భట్టి విక్రమార్క దీక్ష భగ్నం.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు

భట్టి విక్రమార్క  దీక్ష భగ్నం.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు

సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిన్న రాత్రే ఆయన్ను ఆస్పత్రికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయాన్నే దీక్షా శిబిరానికి చేరుకున్న పోలీసులు భట్టి విక్రమార్కను బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి నిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు.. పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ శనివారం నుంచి భట్టి ఆమరణ దీక్షకు కొనసాగిస్తున్నారు.

సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరిట ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేపట్టింది. మల్లు భట్టి విక్రమార్కకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఇందిరాపార్కుకు తరలివచ్చారు. ఈ క్రమంలో పలువురు ఇతర పార్టీ నేతలు కూడా భట్టి విక్రమార్క దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

అధికార టీఆర్ఎస్‌ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే.. ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరాలని రాజ్యాంగంలో ఉందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందనుకోవడం టీఆర్ఎస్‌ భ్రమ అని మండిపడ్డారు. డబ్బుతో నాయకులను కొంటామని కేసీఆర్ అనుకుంటున్నారని... ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పని విమర్శించారు భట్టి విక్రమార్క.

Tags

Read MoreRead Less
Next Story