పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడికి టీ కాంగ్రెస్ ప్లాన్
ఎమ్మెల్యేల పిరాయింపులను నిరసిస్తూ.. కాంగ్రెస్ ఆందోళన కార్యచరణకు సిద్దమవుతోంది. ఓవైపు న్యాయపోరాటం చేస్తునే .. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ తో ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడికి ప్లాన్ చేస్తోంది. విడతల వారిగా ఈ కార్యాచరణ అమలు చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. 12 మంది శాసనసభ్యులు టిఆర్ఎస్ లో వీలినం కావడాన్ని తెలంగాణ కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోంది. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కేసీఆర్ చేసిన విలీన ప్రక్రియను ఎదుర్కొనేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. విలీన అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం సైతం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నిరవధిక దీక్ష చేశారు. ఇప్పుడు మరింత దూకుడు పెంచాలని నిర్ణయించారు టీ కాంగ్రెస్ నేతలు.
ఓ వైపు 12 మంది ఎమ్మెల్యే పై న్యాయ స్ధానంలో పోరాటం చేస్తునే.. మరో వైపు వివిధ రంగాలకు చెందిన మేధావులు, రాజ్యంగ నిపుణలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు హస్తం నేతలు. దీంతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ వారి ఇళ్ళను ముట్టడించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ మారడానికి కాంగ్రెస్ నాయకత్వ లోపమేనని ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. తాము ఇచ్చిన బీ ఫామ్ తో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడికి పార్టీ ముఖ్యనేతలే వెళ్ళాలని నిర్ణయించారు. హైకోర్ట్ లో జరుగుతున్న ఫిరాయింపుల కేసును డీల్ చేసేందుకు పార్టీ సీనియర్ న్యాయవాదులను రప్పించనున్నారు. రాష్ట్ర నాయకులు ఇప్పటికే ఈ అంశాలపై అధిష్టానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై హైకమాండ్ సైతం రాష్ట్ర నేతలకు డైరెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com