ఎంపీలకు ఆ అంశంపై సీఎం జగన్‌

ఎంపీలకు ఆ అంశంపై సీఎం జగన్‌

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగిన YCP పార్లమెంటరీ పార్టీ సమావేశానికి.. పార్టీ అధినేత జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి YCP లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంటు ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్రం నుంచి నిధులు సాధించడంపై ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు అడుగుతూనే ఉండాలని, దీనిపై ఏ మాత్రం వెనక్కితగ్గవద్దని జగన్ ఎంపీలకు సూచించారు. రాష్ట్ర సమస్యలను సామరస్యపూర్వకంగా కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై పార్టీ ఎంపీలకు వివరించారు. ఎంపీల్లో ఎక్కువ మంది కొత్త వారు కావడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సభలో ఏవిధంగా లేవనెత్తాలన్న అంశంపై సీఎం జగన్‌ సూచించారు.

పార్లమెంట్‌లో నాలుగవ అతి పెద్ద పార్టీగా వైసీపీ ఉందన్నారు జగన్. దీన్ని ఒక అవకాశంగా భావించాలని ఎంపీలకు స్పష్టం చేశారు. సంఖ్యాబలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ఫలితాలు రాబట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల గౌరవం పెరిగేలా, హుందాగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ గైడ్ చేశారు. వ్యక్తిగత ఆసక్తి, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలను ఎంపిక చేసుకోవాలన్నారు.

ఎంపీలను సబ్‌ గ్రూప్‌లుగా ఏర్పాటు చేసి, మంత్రిత్వ శాఖల వారీగా సబ్జెక్టులు కేటాయిస్తామన్నారు జగన్‌. తరచుగా ఆయా మంత్రిత్వ శాఖలతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలపై దృష్టి సారించాలన్నారు. పార్లమెంట్‌ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌గా మిథున్‌ రెడ్డి సలహాలు, సూచనలతో సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అడ్వైజ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story