ఏనుగుల గుంపు బీభత్సం.. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే..

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మన్యంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. గజరాజుల దాడిలో ఇద్దరు గిరిజన మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎప్పుడు ఏనుగులు విరుచుకుపడతాయోనని స్థానికులు తీవ్రభయబ్రాంతులకు లోనవుతున్నారు. సీతంపేట మండలం మండ పంచాయతీ ఈతమానుగూడలో ఐదు ఏనుగుల గుంపు విరుచుకుపడింది. గ్రామ సరిహద్దులో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఇద్దరు మహిళలపై గజరాజులు దాడి చేశాయి. దీంతో సవర గైయ్యారమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. బోడమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఈమెను శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బోడమ్మ చనిపోయింది.
గజరాజులను అడ్డుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. ఇప్పటివరకు పంటలను మాత్రమే ధ్వంసం చేసిన ఏనుగులు.. ఇప్పుడు ప్రజల ప్రాణాలను బలిగొనడంతో గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com