ప్రధాని తీరుపై సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు
లోక్సభ ఎన్నికల ముగిసిన తరువాత తొలిసారి ప్రధాని తీరుపై సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించలేదా అని మీడియా ప్రశ్నిస్తే.. ప్రతి దానికీ ప్రధానిని పిలవాలా అని ఎదురు ప్రశ్నించారు. గతంలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్రం నుంచి ఒక్కపైసా అదనంగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో మోదీ ప్రధాని అయ్యాక అతి కఠినంగా నిందించిన వ్యక్తిని తానే అని గుర్తు చేశారు. ఏడు మండలాలు, సీలేరు పవర్ ప్లాంటు ఏపీకి ఇచ్చినప్పుడు ఫాసిస్టు పీఎం అని అన్నాను అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా అబద్ధాలు మాట్లాడితే ఆయనను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశానన్నారు.
విపక్షాల తీరుపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తలపెట్టిన ప్రతీ పనిని విమర్శించటమే పనిగా పెట్టుకున్నాయన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అతిథిగా వస్తుంటే రావొద్దని ఎలా అంటారని ప్రశ్నించారు కేసీఆర్. ఢిల్లీ వేళ్తే ఒకలా వెళ్లకుంటే మరోలా విపరీత ఆర్ధారాలు తీసే ధోరణి మానుకోవాలని సూచించారు.
ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలతో స్నేహసంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం భూమి సాగులోకి వచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రం సొంత ఖర్చులతోనే నిర్మించిందని గుర్తు చేశారు కేసీఆర్. ఓ వైపు త్వరలో తాను చేయబోతున్న అభివృద్ధి పనులను వివరిస్తూనే.. కేంద్రపై ఘాటు విమర్శలు చేశారు కేసీఆర్. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రాన్ని ఎప్పుడూ పెద్దగా టార్గెట్ చేయని కేసీఆర్.. ఇప్పుడు నేరుగా ప్రధానిని విమర్శించడం హాట్ టాపిక్ అయ్యింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com