తెలంగాణ సచివాలయం కూల్చివేత వ్యవహారంపై కోర్టుకెక్కిన కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ సచివాలయం కూల్చివేత వ్యవహారంపై కోర్టుకెక్కిన కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ సచివాలయం కూల్చివేత వ్యవహారంపై మరో సారి హైకోర్టుకు తలుపు తట్టారు కాంగ్రెస్‌ నేతలు. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలను కూల్చివేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేవలం వాస్తు లోపాలున్నాయని సాకు చూపిస్తూ సచివాలయం కూల్చివేతకు పూనుకోవడం సరికాదని పేర్కొన్నారు. గతంలోనే ప్రస్తుత సచివాలయం భవనాన్ని కూల్చబోమని సర్కారు తరఫున అప్పటి అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఆదే ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన మాట మార్చిందని, సచివాలయం భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని తాజాగా జీవన్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది.

అటు అసెంబ్లీ నూతన భవన నిర్మాణంపైననూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లోని ఓ పురావస్తు భవనాన్ని కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయించిందని.. దీన్ని అడ్డుకోవాలంటూ కొంతమంది విద్యార్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కూడా శుక్రవారం పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.

ఈనెల 27న సచివాలయం, అసెంబ్లీ కొత్త భవనాలకు శంకుస్థాపన చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పాత భవనాలకు కూల్చివేయాలని నిర్ణయించింది. ఈనేపథ్యంలో పిటిషన్లపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story