వారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు - మోదీ

వారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు - మోదీ

లోక్ సభలో మాటల తూటాలు పేల్చారు ప్రధాని మోదీ. పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను కడిగిపారేశారు. గొప్పవాళ్లను గౌరవించే సంప్రదాయం ఆ పార్టీలో లేదంటూ ఫైరయ్యారు. పీవీ, మన్మోహన్ లకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశాన్ని పెద్ద జైలుగా మార్చిందని విమర్శించారు.

రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో మాట్లాడారు. తమపై నమ్మకం ఉంచి మరోసారి అధికారం అప్పగించినందుకు ప్రజలు మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజల, మహాపురుషుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష సభ్యులు చేసిన సలహాలను స్వీకరిస్తామని చెప్పారు మోదీ. కాంగ్రెస్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు మోదీ. దేశానికి వాజ్ పేయ్ చాలా మంచి పాలన అందించారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ తన పదేళ్ల పాలనలో ఏనాడూ అటల్ పేరు కూడా ఎత్తలేదని విమర్శించారు. ఒక్క అటల్ నే కాదు... పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ నూ కాంగ్రెస్ అవమానించిందన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిన వీళ్లద్దరికీ భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రణబ్ ముఖర్జీని తమ ప్రభుత్వం భారతరత్నతో గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ రోజులను కాంగ్రెస్ ఓసారి గుర్తుచేసుకుంటే మంచిదన్నారు మోదీ.ప్రజలను జైళ్లలో పెట్టిన ఆ చీకటి రోజులను ఎప్పటికీ మరువలేం అని చెప్పారు.

అంతకుముందు ఉభయసభల్లోనూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్‌ 16 వరకు జమ్మూకశ్మీర్‌లో 113 మంది టెర్రరిస్టులను భారత బలగాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా లోక్ సభకు వెల్లడించారు. ఈ ఆర్నేళ్ల కాలంలో 18 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు మొత్తం 733 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. టెర్రర్‌ దాడులు 2014 నుంచి ఇప్పటి వరకు మూడింతలు పెరిగాయన్నారు. ఈ మేరకు కిషన్ రెడ్డి లోక్ సభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మ‌హిళ‌ల సాధికార‌త కోసం మోదీ ప్ర‌భుత్వం విశేషంగా కృషి చేసింద‌న్నారు ఎంపీ హేమామాలిని. ప్రధాని చేప‌ట్టిన మ‌హిళ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ఆమె కొన్ని క‌విత‌ల ద్వారా వినిపించారు. బెంగాల్ న‌టి, ఇటీవ‌ల ఎన్నికైన నుష్ర‌త్ జ‌హాన్‌.. లోక్‌స‌భ‌లో ఎంపీగా ప్ర‌మాణం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బషీరత్‌ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన నుష్ర‌త్ 3.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక నుష్రత్‌ స్నేహితురాలు మిమి చక్రవర్తి కూడా TMC తరపున ఎంపీగా గెలుపొందారు..ఆమె కూడా ఎంపీగా ప్ర‌మాణం చేశారు.

అటు సోమవారం చనిపోయిన రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ సైని మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది. అనంతరం సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. సాధారణంగా సిట్టింగ్ సభ్యుడు చనిపోతే ... ఒక రోజు వాయిదా వేసే సంప్రదాయం పాటిస్తున్నారు. కానీ రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాల్సి ఉండటం, ప్రధాని మోదీ బుధవారం విదేశీ పర్యటనకు వెళ్తుండటంతో సభను ఒకపూట మాత్రమే వాయిదా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story