తెలంగాణలో మరో ఎన్నికల సందడి..
జూలైలో మున్సిపల్ ఎన్నికల నగరా మోగుతుందన్నారు సీఎం కేసీఆర్. ఈ ఎన్నికల్లోనూ.... పరిషత్ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని... ఒక్కో నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు నమోదు చేయాలంటూ పార్టీ నేతలను ఆదేశించారు. మొత్తంగా కోటి సభ్యత్వాలు జరిగేలా చూడాలన్నారు. జులై 20నాటికి సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని,. జూలై 30 నాటికి గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు కేసీఆర్.
ఈ సమావేశంలో బీజేపీపై విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమంటూ 8 మంది జెడ్పీటీసీలు ఉన్న బీజేపీ చెప్పుకుంటోందంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చేస్తున్న విమర్శలు, ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారాయన. మున్సిపల్ ఎన్నికలు ఇప్పటికిప్పుడు పెట్టడం వ్లల ఇబ్బందులు ఎదురువుతాయన్న ఎమ్మెల్యేలు జోగు రామన్న, అంజయ్య యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. అటు.... పార్టీ డిసైడ్ చేసిన వారే టీవీ చర్చలకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
కాళేశ్వరం, మిషన్భగీరథ పనులు పూర్తయ్యాయని, ఇక పాలమూరు రంగారెడ్డి పథకంపై దృష్టిపెడతామన్నారు. మరో రెండ్రోజుల్లో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేసీఆర్ తొలి సభ్యత్వం స్వీకరించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన 11 ప్రత్యేక కౌంటర్లలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు మెంబర్షిప్ తీసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com