అందుకోసం ఆగస్ట్‌ 1వ తేదీ నుంచి శ్రీకారం..

ఏపీ సీఎం జగన్‌తో కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు సుమారు రెండు గంటల పాటు చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని అరోపణలు వచ్చిన 30 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాజధాని భూ సేకరణ, భూ కేటాయింపులతో పాటు, ప్రాజెక్టులు, దోమలపై దండయాత్ర నుంచి ప్రతి పనిలోనూ అవినీతి జరిగిందని గత కొన్నాళ్లుగా వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి తమ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అన్నారు మంత్రి కన్నబాబు. 45 రోజుల్లో కమిటీ విచారణ పూర్తి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఇకపై 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని వివరించారు.

గత అయిదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని అధికారులు వెల్లడించారన్నారు. ప్రాజెక్టులు నిర్మాణాత్మక పనుల్లో ఎక్కువ అవినీతి జరిగిందన్నారు.

మరోవైపు సీఎం జగన్‌ ఆగస్ట్‌ 1వ తేదీ నుంచి ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నట్టు సబ్‌ కమిటీలో స్పష్టం చేశారు. అలాగే సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం కానన్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చేసే సూచనల ఆధారంగా ఉప సంఘం విచారణ ఇకపై సాగనుంది. ఈ విచారణ శాస్త్రీయంగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల్లోని ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story