సంచలనాల పాకిస్తాన్‌ సెమీస్‌ రేస్‌లో నిలుస్తుందా..?

వరల్డ్‌కప్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ కిక్‌ ఇస్తోంది. అయితే, సెమీస్‌ రేస్‌ మరింతగా కిక్‌ ఇవ్వనుంది.. ఆస్ట్రేలియా ఇప్పటికే 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోగా.. ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాతోపాటు శ్రీలంక సెమీస్‌ ఆశలు వదులుకుంది. సెమీస్‌ బెర్త్‌లో మిగిలిన మూడు స్థానాల కోసం ఐదుజట్లు రేసులో నిలిచాయి. ఇందులో న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ 8 మ్యాచ్‌లు పూర్తిచేసుకోగా భారత్‌, బంగ్లాదేశ్‌ ఏడు చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. అయితే, ఈ జట్లు ఆడే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆ తర్వాతే ఏ జట్టు సెమీస్‌కు వెళ్తుందనేది తేలనుంది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడిన అనంతరం సమాన పాయింట్లు వస్తే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు నేరుగా సెమీస్‌కు అర్హత సాధిసస్తుంది. భారత్‌ విషయానికొస్తే ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీసేన ఐదు గెలవగా.. ఒకటి ఓడిపోయింది.. మరో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.. దీంతో 11 పాయింట్లతో సెకండ్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఈ రెండిట్లో ఒక్కటైనా గెలిస్తే టీమిండియా నేరుగా సెమీస్‌ చేరుతుంది.. మెరుగైన రన్‌ రేట్‌ కూడా భారత్‌కు కలసిరానుంది.

ఇంగ్లండ్‌ జట్టుకూ సెమీస్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయి.. భారత్‌పై విజయంతో పది పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది మోర్గాన్‌ సేన. మరోవైపు పాక్‌, బంగ్లా నుంచి ప్రమాదం పొంచి ఉన్నా న్యూజిలాండ్‌తో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌ బెర్త్‌ ఖాయమవుతుంది. లేకుంటే మిగతా జట్ల సమీకరణాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.

ఇక న్యూజిలాండ్‌ కూడా పదకొండు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది.. ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్‌ ఐదు గెలిచింది.. భారత్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఒక పాయింట్ లభించింది.. రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోలేకపోయింది. అయితే, బంగ్లా, పాక్‌ కంటే మెరుగైన రన్‌ రేట్‌ కలిగి ఉండటంతో సెమీస్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయి.. ఇంగ్లండ్‌తో జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది.

ఇక వరుస పరాజయాలతో సెమీస్‌ రేసును సంక్లిష్టం చేసుకున్న పాకిస్తాన్‌.. ఆ తర్వాత వరుస విజయాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.. భారత్‌ చేతిలో ఓటమి తర్వాత సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆఫ్గాన్‌పై వరుస విజయాలను నమోదు చేసుకుని సెమీస రేసులోకి వచ్చింది.. ప్రస్తుతం పాకిస్తాన్‌ 9 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.. అయితే, నెట్‌ రన్‌ రేట్‌ మైనస్‌లో ఉండటంతో అవతలి జట్లపై భారం వేయాల్సిన పరిస్థితి. బంగ్లాదేశ్‌తో జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారీ తేడాతో పాక్‌ గెలవాల్సి ఉంది.. అంతేకాదు, న్యూజిలాండ్‌ చేతిలో ఇంగ్లండ్‌ చిత్తుగా ఓడిపోతే తప్ప పాక్‌కు సెమీస్‌ ఛాన్స్‌ దక్కదు.. అలాగే బంగ్లాదేశ్‌కు కూడా సెమీస్‌ అవకాశాలు వున్నాయి. అయితే, చివరి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు నమోదు చేయడంతోపాటు.. ఇంగ్లండ్‌, పాక్‌ చిత్తుగా ఓడితేనే బంగ్లాదేశ్‌ సెమీస్‌ రేస్‌లో నిలబడే ఛాన్స్‌ ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story