దుబాయ్‌లో అష్టకష్టాలు పడుతున్న తెలుగు మహిళ

దుబాయ్‌లో అష్టకష్టాలు పడుతున్న తెలుగు మహిళ

దుబాయ్‌లో అష్టకష్టాలు పడుతున్న ఓ తెలుగు మహిళ తనను కాపాడమని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. తాను అక్కడ పడుతున్న కష్టాలను ఏకరవు పెడుతూ బాధితురాలు కన్నీటి పర్యంతం అవుతోంది. సోషల్‌మీడియాలో బాధితురాలు సమీనా.. పోస్ట్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌ కుల్కచర్ల మండల కేంద్రాననికి చెందిన 23 ఏళ్ల సమీన.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన మూడేళ్లకు వారి బాబు పుట్టాడు. అయితే ఆ బాబుకు జీర్ణ సంబంధిత వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అవ్వడంతో.. సమీనాను వదిలి వెళ్లిపోయాడు భర్త. దీంతో ఒక్కసారిగా ఆమెను కష్టాలు చుట్టుముట్టాయి..

కొన్ని రోజులు పాటు ఇళ్లలో పాచిపనులు చేస్తూ.. జీవితం నెట్టుకొచ్చినా.. కొడుకు అనారోగ్యం నయం చేయడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడేది. దీంతో తెలిసిన వాళ్లు కొందరు దుబాయ్‌లో పని ఉందని చెప్పడంతో.. అవకాశాన్ని వదులుకోలేక తన కొడుకు ఆపరేషన్‌ డబ్బు కోసం ఏజెంట్‌ ద్వారా దుబాయ్‌ వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లాక ఓ దుబాయ్‌ షేక్‌ ఇంట్లో పనికి కుదిర్చి ఏజెంట్‌ చేతులుదులుపుకున్నాడు.

ఉద్యోగంలో చేరి మూడు నెలలు అయినా షేక్‌ డబ్బులు ఇవ్వడం లేదు. మరోవైపు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. శారీరకంగా మానసికంగా వేధించసాగాడు. పోని ఏదోలా తిరిగి భారత్‌కు వచ్చేదమంటే అప్పటిక పాస్‌పోర్టును ఏజెంట్‌ లాక్కున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏదో ఒకలా అక్కడి నుంచి తప్పించుకుని.. వేరే దగ్గర పనికి కుదిరినా అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో గత మూడు నెలలుగా తాను అనుభవిస్తున్న నరకయాతనను వివరిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోను పెట్టింది. ప్రభుత్వం ఆదుకుని తనను ఎలాగైనా తన కొడుకు దగ్గరకు చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story