కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిరాశ

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిరాశ

తెలంగాణకు కేంద్రం మరోసారి మొండి చేయిచూపింది. సీఎం కేసీఆర్ వినతులు బుట్టదాఖలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కలేదు. కేంద్ర బడ్జెట్‌ లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు కేటాయించలేదు. ఆశలపల్లకీలో ఊరేగిన తెలంగాణకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఏవో కొన్నింటికి నిధులు తప్ప కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు దక్కిందేమీ లేదు. సింగరేణిలో కేంద్రం 1850 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. అటమిక్‌ మినరల్స్ రీసెర్చీకి 313 కోట్లు, సాలార్ జంగ్‌ మ్యూజియానికి 28 కోట్లు, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ కు 28 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డ్‌ కు 80 కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్ అభివృద్ధి ప్రాజెక్ట్‌కు 200 కోట్లు, హైదరాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్డు రెండో దశకు 120 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు 80 కోట్లు దక్కాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు తదితర కీలక డిమాండ్లు అమలుకు నోచుకోలేదు.

కేంద్రం బడ్జెట్‌ తెలంగాణను.. తీవ్రంగా నిరాశపరిచిందన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ నామానాగేశ్వర్‌రావు. హర్‌ ఘర్‌ జల్‌ పథకం నిధులు.. మిషన్‌ భగీరథకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో.. తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు జరగలేదన్నారు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి. మోడీ సర్కారు.. దక్షిణాధి రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపుతోందన్నారు. నిధులు కేటాయించకుండా.. మరోసారి కేంద్రం రాష్ట్రాలను మోసం చేసిందన్నారు రేవంత్‌రెడ్డి.

బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడం బాధాకరమన్నారు మరో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతైనా మోదీ ప్రభుత్వం తెలంగాణ గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 19 వేల 718 కోట్లు. దీనికి తగ్గట్టు బడ్జెట్‌ లో కేటాయింపులు లేవని నేతలు మండిపడ్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story