కేంద్రం తీరుపై ట్విట్టర్లో విమర్శలు కురిపించిన కేటీఆర్
కేంద్రం తీరుపై ట్విట్టర్లో వరుస విమర్శలు కురిపించారు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ రెండు పథకాలకూ 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందనీ, కేంద్రం మాత్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో కనీసం ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రం విస్మరించిందని కేటీఆర్ ట్విట్టర్లో ప్రస్తావించారు.ఐదేళ్లు పూర్తయినా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. పలు పథకాలపై కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రశంసలు వచ్చాయని.. కానీ నిధులు మాత్రం రావడం లేదని ట్విటర్లో పోస్టు చేశారు. రాష్ట్రానికి రావాల్సినవి కూడా దక్కకపోవడం బాధాకరమన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com