మల్లన్నసాగర్‌పై హైకోర్టు సంచలన తీర్పు

మల్లన్నసాగర్‌పై హైకోర్టు సంచలన తీర్పు

మల్లన్న సాగర్‌ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తప్పుడు సమాచారం ఇచ్చిన ముగ్గురు అధికారులకు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ తీర్పును ఉల్లంఘించి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో పనులు చేపట్టినట్లు వీరిపై అభియోగాలు నమోదు కావడంతో కోర్టు వీరికి జైలు శిక్ష విధించింది.

మల్లన్న సాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు అధికారులకు జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. తమకు పునరావాసం కల్పించకుండానే చట్టవిరుద్ధంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌కు చెందిన 70 మంది వ్యవసాయ కార్మికులు గతేడాది ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టం ప్రకారం పునరావాసం కల్పించకుండా పనులు చేపట్టవద్దని హైకోర్టు గతేడాది జులై 25న ఆదేశించింది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుగులో సమర్పించి.. పిటిషనర్ల అభ్యంతరాలను మరోసారి స్వీకరించి నిర్ణయం ప్రకటించాలని స్పష్టంచేసింది.

అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ తాజాగా వేములఘాట్‌కు చెందిన 17 మంది కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు మూడో యూనిట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న సిద్దిపేట ఆర్డీవో జయచంద్రా రెడ్డి, తొగుట తహసీల్దార్ ఎల్.వీర్ సింగ్ కోర్టు ధిక్కరణకు పాల్పడటమే కాకుండా.. న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు హైకోర్టు తేల్చింది. అదేవిధంగా నీటి పారుదల శాఖ గజ్వేల్ డివిజన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ టి.వేణు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో జయచంద్రా రెడ్డి, ఎల్.వీర్ సింగ్, టి.వేణుకు మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.2వేలు చొప్పున జరిమానా విధించింది. వారు అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా శిక్షను ఆరు వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Tags

Read MoreRead Less
Next Story