అమ‌ర్‌నాథ్ యాత్రకు బ్రేక్..

అమ‌ర్‌నాథ్ యాత్రకు బ్రేక్..

అమ‌ర్‌నాథ్ యాత్రకు బ్రేక్ ప‌డింది. జ‌మ్మూ బేస్ నుంచి వెళ్లాల్సిన యాత్రికులను నిలిపేశారు. కశ్మీర్ వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునివ్వడంతో యాత్రను తాత్కాలికంగా ఆపేశారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీ వర్ధంతి సందర్భంగా కాశ్మీర్‌ వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో శ్రీనగర్ సిటీ మొత్తం షట్ డౌన్ అయింది. ఈనేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులను అనుమతించలేదు. అటు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్నందు వ‌ల్ల కూడా జ‌మ్మూ బేస్‌లో ప్రయాణికుల‌ను ఆపేసిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.. బ‌ల్తాల్‌, పెహ‌ల్గామ్ రూట్లలో ఎక్కువ మంది భక్తులు నిలిచిపోవ‌డంతో యాత్రికుల తదుపరి బ్యాచ్‌ను జ‌మ్మూ బేస్‌లోనే అపేసినట్లు తెలిపారు.

ఈనెల 1న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆగస్ట్‌ 15తో యాత్ర ముగుస్తుంది. ఇప్పటి వరకు సుమారు లక్షమంది వరకు భక్తులు హిమలింగాన్ని దర్శించుకున్నారని అధికారులు చెప్పారు. అటు స్థానిక ముస్లింల స‌హాకారం వ‌ల్లే అమ‌ర్‌నాథ్ య‌త్ర సాధ్యమ‌వుతోంద‌ని జమ్మూకశ్మీర్ గ‌వ‌ర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. యాత్రికుల రక్షణ,భద్రత దృష్ట్యా జాతీయ రహదారిపై ప్రతిరోజూ రెండు గంటలు పౌర రద్దీపై విధించిన అడ్డంకులను భరించాలని ప్రజలను కోరారు సత్యపాల్..

అయితే యాత్రికుల‌కు భారీ స్థాయిలో సెక్యూర్టీ ఏర్పాటు చేయ‌డంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీ . ప్రతి ఏటా సీఆర్ఫీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు భక్తుల రక్షణను చూసుకుంటుంటారని.. కానీ, ఈసారి మాత్రం ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారని విమర్శించారు. అమర్ నాథ్ యాత్రకు ఏర్పాట్లపై కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు ముప్తీ.

Tags

Read MoreRead Less
Next Story