రైతుల కుటుంబాల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

రైతుల కుటుంబాల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

అధికారంలోకి వచ్చిననాటి నుంచే సంక్షేమ సూత్రం పాటిస్తున్న ఏపీ ప్రభుత్వం...రైతుల కుటుంబాల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు పరిహారాన్ని చెల్లించాలని నిర్ణయించింది. రికార్డుల ప్రకారం ఏపీలో వెయ్యి 513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ, 391 కుటుంబాలకే పరిహారం అందినట్టు రికార్డులు చెప్తున్నాయని సీఎం జగన్ అన్నారు. మిగిలిన రైతు కుటుంబాలకు సాయం నిరాకరించినట్టు అర్థం అవుతోందన్నారు. జిల్లాల్లో డేటాను పరిశీలించి.. ఎవరైనా అర్హులైన కుటుంబాలు ఉంటే, వెంటనే పరిహారం ఇవ్వాలని ఆదేశించారాయన. ఎక్కడైనా రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే కలెక్టర్‌ స్పందించాలన్నారు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కష్టాల్లో ఉన్న రైతు కుటుంబం దగ్గరకు వెళ్ళాలని సీఎం జగన్ సూచించారు.

సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్..స్పందన కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధఠికారులకు సూచించారు. స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్లు ఎవరూ మిస్ కావొద్దన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంలో నాణ్యత చూపించాలని, మనస్సు పెట్టి సమస్యను పరిష్కరించాలని జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి స్పందన కార్యక్రమానికి 4,400 వినతులు వచ్చాయని గుర్తు చేసిన సీఎం..వాటిని వారంలో పర్కిషర్తించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. ఎక్కువగా పెన్షన్లు, హౌసింగ్, రేషన్ కార్డులకు సంబంధించిన వినతులు వస్తున్నాయని అధికారుల నుంచి తెల్సుకున్న జగన్..గ్రామ సచివాలయాలను డైనమిక్ గా మార్చడమే దీనికి పరిష్కారమని అన్నారు.

స్పందన కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేశారు జగన్. విజయవాడ సెంట్రల్ లో బినామీ డీలర్ రేషన్ షాపు నిర్వహిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై రిజెక్ట్ చేయటాన్ని ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. ఫిర్యాదు దారుడు సరైన పత్రాలు ఎలా ఇస్తారంటూ అధికారులను ప్రశ్నించారు సీఎం. దీంతో బినామీ డీలర్ వ్యవహారంపై విచారణ జరిపిన అధికారులు..పౌరసరఫరాల శాఖ అధికారి ఉదయభాస్కర్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

ఆ తర్వాత క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగన్..రాజధాని భూములు, ల్యాండ్ పూలింగ్, భూములు కేటాయింపు నిర్మాణాలపై ఆరా తీశారు. రాజధాని పరిధిలోని గత ఐదేళ్లలో జరిగిన వ్యవహారాలపై అధికారులను వివరాలు అడిగిన సీఎం..సీఆర్డీఏ చట్టంలో మార్పులు సాధ్యాసాధ్యాలు, న్యాయపరమైన అంశాలపై చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story