టెన్షన్‌లో టీమిండియా.. 240లోపు లక్ష్యాన్ని కూడా ఛేదించడం కష్టమే..

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్‌ మ్యాచ్ నిన్న వర్షం కారణంగా మధ్యలో నిలిచిపోవడంతో.. ఇవాళ అది కొనసాగనుంది. ఇలాంటి ఆటంకాలు ఏమైనా రావొచ్చన్న ఉద్దేశంతో ముందుగానే రిజర్వ్‌డేను ప్రకటించినందున.. మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలవుతుంది. నిన్న టాస్ గెలిచి కివీస్ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది. 46.1 ఓవర్‌ సమయంలో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. అదికాస్త భారీ వర్షంగా మారడంతో మ్యాచ్‌ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అంపైర్లు ఇవాళ్టికి వాయిదా వేశారు. మ్యాచ్‌ నిలిచే సమయానికి కివీస్‌ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం రాస్‌ టేలర్‌-67 పరుగులతో, లాథమ్‌ - 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మ్యాచ్‌ను ఇవాళ్టికి వాయిదా వేయడానికి ముందు అంపైర్లు తర్జనభర్జన పడ్డారు. ఎట్టిపరిస్థితిల్లోనూ మ్యాచ్‌ ముగించాలని భావించారు. వీలు కుదిరితే ఛేదనలో టీమిండియాను 20 ఓవర్లైనా ఆడించేందుకు ప్రయత్నించారు. అయితే వర్షం వస్తూ పోతుండటంతో మ్యాచ్‌ కొనసాగించడం కష్టమని భావించిన అంపైర్లు రిజర్వ్‌డేకు వాయిదా వేశారు. ఇవాళ కూడా ఇలాంటి పరిస్థితే ఉంటే.. లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లతో ఉన్న కోహ్లీసేన ఫైనల్‌ చేరుకుంటుంది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను టీమిండియా బౌలర్లు చెడుగుడు ఆడుకున్నారు. భువనేశ్వర్‌, జస్ప్రీత్‌ బుమ్రా తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌ వేశారు. ఒక్క పరుగు వద్దే ఫామ్‌లో లేని కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ ను బుమ్రా ఔట్‌ చేసి కివీస్‌కు షాక్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో హెన్రీ నికోలస్‌ తో కలిసి సారథి కేన్‌ విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. జట్టు స్కోరు 69 వద్ద ఓ అద్భుతమైన బంతితో నికోలస్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ తో కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. అనంతరం అర్ధశతకం అందుకున్నాడు. భారత బౌలింగ్‌ దెబ్బకు కివీస్‌ 29 ఓవర్లకు గానీ 100 పరుగులు దాటలేదు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. అర్ధశతకం తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో చాహల్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఔటయ్యాడు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి కివీస్‌ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇక్కడి నుంచే ఇవాళ న్యూజిలాండ్‌ ఆటను ఆరంభించనుంది.

వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం భారత్‌ను కూడా టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే పిచ్ బ్యాటింగ్‌కు అస్సలు అనుకూలించడం లేదు. పిచ్‌ మరింత నెమ్మదిస్తే అదంతా బౌలర్లకు అనుకూలంగా మారుతుంది. అప్పుడు పరుగులు రాబట్టడం కష్టమవుతుంది. కివీస్ బ్యాటింగ్ పూర్తి చేసి.. టీమిండియాకు 240లోపు లక్ష్యాన్ని నిర్దేశించిందనుకున్నా.. ఆ టార్గెట్ ఛేదిండానికి కష్టపడాల్సి రావొచ్చు. ఒకవేళ మళ్లీ మధ్యలో వర్షం పడితే డక్‌వర్త్ లూయిస్ ఫార్ములా తెరపైకి వస్తుంది. ఇది ఎవరిని ఇబ్బంది పెడుతుందోనన్న టెన్షన్ కూడా ఉంది. ఏదేమైనా వర్షం లేకుడా సాఫీగా మ్యాచ్ జరిగితే భారత్ సమర్థంగా కివీస్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనోళ్లు ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు కాబట్టి ఛేజింగ్ కష్టం కాదు. ఐతే...... బౌల్ట్‌, ఫెర్గూసన్‌, హెన్రీలను సమర్థంగా ఎదుర్కొని జాగ్రత్తగా పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ కాదని.. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే టీమిండియా నేరుగా ఫైనల్స్‌కి చేరుతుంది. లీగ్‌ దశలో కివీస్‌ కన్నా ఎక్కువ పాయింట్లతో భారత్ టాప్‌లో ఉంది కాబట్టి ఫైనల్స్‌కి వెళ్తుంది.

ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌ వర్షం వల్ల రెండో రోజుకు వాయిదా పడటం ఇది రెండోసారి. 1999లో ఇదే ఇంగ్లాండ్‌లో ఈ పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇంగ్లడ్ జట్టుపై భారత్ గెలిచింది. మొదట భారత్‌ 8 వికెట్లకు 232 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 20.3 ఓవర్లలో 73/3తో ఉండగా వర్షంతో మ్యాచ్‌ ఆగింది. మర్నాడు ఆట మొదలయ్యాక మన బౌలర్లు సత్తా చాటారు. 169 పరుగులుకే ఇంగ్లాండ్‌ ఆల్‌అవుట్ అయ్యింది. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది.

Read MoreRead Less
Next Story