మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే..

మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే..

చిన్నారులపై అఘాయిత్యాలకు తెగబడేవాళ్లకు ఇకపై కఠిన శిక్షలు తప్పవు. పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడితే ఉరిశిక్ష పడడం ఖాయం. అలాగే, పిల్లలను పోర్నోగ్రఫీకి ఉపయోగిస్తే కూడా కఠిన శిక్షలు, భారీ జరిమానా విధిస్తారు. ఈ మేరకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పోక్సో చట్ట సవరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడితే జరిమానా, కారాగార వాసం విధించేలా పోక్సో చట్టాన్ని సవరించనుంది.

ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, కీలక నిర్ణయాలు తీసుకుంది. సంఘటిత, అసంఘటిత రంగంలో ఉన్న లక్షలాది మంది కార్మికులకు మేలు చేసేలా కార్మిక రక్షణ కోడ్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు 13 కేంద్ర కార్మిక చట్టాలను ఒకే కోడ్ పరిధిలోకి తీసుకురానున్నారు. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవ, ఐటీ రంగాల కార్మికులకు ప్రయోజనాలు అందనున్నాయి.

దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్ద పీట వేసింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద మూడో దశలో 80 వేల 250 కోట్ల వ్యయంతో లక్షా 25 వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్రాష్ట్ర నదీ వివాదాల పరిష్కార చట్ట సవరణ బిల్లును ఆమోదించిన మంత్రి వర్గం, ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక-సామాజిక-విద్యాభివృద్దికి చర్యలు తీసుకునేలా ట్రాన్స్‌జెండర్స్ పర్సన్స్ 2019 కి ఆమోదం తెలిపింది. అలాగే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసులకు గ్రూప్-ఏ హోదా కల్పించింది.

Tags

Read MoreRead Less
Next Story