బీజేపీలో కొత్త ఉత్సాహం
కర్ణాటకలో.... రాజకీయ హైడ్రామాకు ఇప్పట్లో పుల్స్టాప్ పడే అవకాశాలు కనిపించడం లేదు. బల పరీక్ష సమయం దగ్గరపడే కొద్దీ కూటమికి మరిన్ని పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. కూటమి నేతలు బుజ్జగిస్తున్నప్పటికీ కాంగ్రెస్ రెబల్ నేతలు దిగి రావడం లేదు. రాజీనామా ఉపసంహరించుకుని పార్టీలో ఉంటానని చెప్పిన రెబల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు మరోసారి హ్యాండ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బుజ్జగింపు ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చాయి.
కాంగ్రెస్లోనే కొనసాగుతానని శనివారం ప్రకటించిన నాగరాజు.... ఇప్పుడు తన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ముంబయిలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలని కలిసేందుకు అక్కడికి వెళ్లిపోయారు. ఈయనతో పాటు మరో ఎమ్మెల్యే సుధాకర్ కూడా వారితో చేరే అవకాశం ఉంది. శనివారం కూటమి పెద్దలందరితో సుధీర్ఘంగా చర్చలు జరిపిన నాగరాజు.... కాంగ్రెస్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే మరో రెబల్ ఎమ్మెల్యే తన రాజీనామాను వెనక్కి తీసుకుంటేనే ఇందుకు అంగీకరిస్తానని మెలికపెట్టారు. సుధాకర్ను కూడా ఒప్పించే బాధ్యత తానే తీసుకుంటానన్నారు. ఈ విషయంపై దాదాపు 15 గంటలపా చర్చలు జరిపారు. కానీ చివరి నిమిషంలో నాగరాజు... తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో కూటమి నేతల చర్చలు వృథా అయ్యాయి.
తాజా పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య భేటీ అయ్యారు. యశ్వంత్ పురలోని తాజ్ హోటల్లో వీరి సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ - జేడీఎస్లో జరుగుతున్న తాజా పరిణామాలతో బీజేపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు తమ రాజీనామాలు ఆమోదించాలని సుప్రీంలో వేసిన పిటిషన్పై రేపు విచారణ జరగనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com